వందేభారత్ ఎక్స్ ప్రెస్ కింద ఇరుక్కుపోయినా సురక్షితంగా బయటపడ్డ ఆవు!.. వీడియో వైరల్

  • రైలు దూసుకొస్తున్నా పట్టాలపై నుంచి కదలని ఆవు
  • ఎమర్జెన్సీ బ్రేక్ వేసిన లోకో పైలట్
  • ఇంజన్ ముందు భాగంలో ఇరుక్కుపోయిన ఆవు
  • చివరకు రైలును రివర్స్ తీయడంతో తప్పిన ప్రాణాపాయం
సాధారణంగా పట్టాలు దాటే క్రమంలో పశువులు రైళ్లు ఢీకొని మృత్యువాతపడుతుంటాయి. అయితే వందేభారత్ ఎక్స్ ప్రెస్ కింద చిక్కుకున్నప్పటికీ ఓ ఆవు మాత్రం అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. అయితే ఇది ఎక్కడ జరిగిందనే విషయం తెలియరాలేదు.

రైల్వే ట్రాక్‌పై ఒక ఆవు పడుకొని గడ్డి నెమరేసుకుంటోంది. అదే సమయంలో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ అదే ట్రాక్ పై దూసుకొచ్చింది. దూరం నుంచే ఆవును గమనించిన లోకోపైలెట్ మానవత్వాన్ని చాటాడు. మూగజీవిని కాపాడాలనే ఉద్దేశంతో వెంటనే ఎమర్జెన్సీ బ్రేక్ వేశాడు. దీంతో రైలు వేగం ఒక్కసారిగా తగ్గింది. అయినా పూర్తిగా ఆగలేదు. చివరకు రైలు ఇంజన్ ముందు భాగం ఆవు వీపుపైకి ఎక్కేసింది. దీంతో ఆవు బాధతో విలవిల్లాడింది. 

ఈ దృశ్యాన్ని కొందరు వీడియో తీశారు. లోకో పైలట్‌ కు రైలును వెనక్కి పోనివ్వాల్సిందిగా సూచించారు. లోకో పైలట్ అలాగే రైలును నెమ్మదిగా రివర్స్ తీసుకోవడంతో ఇంజన్ కింద ఇరుక్కుపోయిన ఆవు తనంతట తానుగా లేచి నిలబడింది. ఆ తర్వాత పట్టాలు దాటి పక్కకు వెళ్లిపోయింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లంతా లోకో పైలట్ ను అభినందిస్తున్నారు.

Vande Bharat Express
Loco Pilot
Emergency brake
Cow
railway track

More Telugu News