కడుపుతో ఉన్న కుక్కను కత్తితో పొడిచి చంపిన కసాయి

  • గుంటూరు జిల్లా అమరావతి రోడ్డులో శుక్రవారం దారుణం
  • స్థానిక చికెన్ సెంటర్‌లోని కోడిని చంపి తిన్న ఓ కుక్క
  • వర్కర్ జీతంలో కోత పెట్టిన చికెన్ సెంటర్ యజమాని
  • కడుపుతో ఉన్న కుక్కే ఈ పని చేసిందని భావించి వర్కర్ దారుణం
  • శుక్రవారం అర్ధరాత్రి పలుమార్లు పోడిచి కుక్కను చంపిన వైనం
గుంటూరు జిల్లాలో దారుణం వెలుగు చూసింది. కడుపుతో ఉన్న వీధి కుక్కను ఓ వ్యక్తి శుక్రవారం దారుణంగా పొడిచి చంపేశాడు. అమరావతి రోడ్డులో అన్నపూర్ణ నగర్ 7వ లైను వద్ద సితార చికెన్ అండ్ మటన్ స్టాల్‌లో గొర్లపాలేనికి చెందిన గోపీకృష్ణ అనే వ్యక్తి పనిచేస్తున్నాడు. శుక్రవారం అర్ధరాత్రి తరువాత అతడు కడుపుతో ఉన్న ఓ వీధి కుక్కను పలుమార్లు కత్తితో పొడిచి చంపేశాడు. అటుగా వెళుతున్న హేమంత్ అనే వ్యక్తి అతడిని నిలువరించే ప్రయత్నం చేసినా లెక్క చేయకుండా కుక్కను చంపి రోడ్డు మీదకు లాక్కొచ్చి పడేశాడు. 

ఘటనపై స్థానిక బ్లూ క్రాస్ విభాగం కార్యదర్శి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితుడు గోపీకృష్ణను అదుపులోకి తీసుకున్నారు. రెండు రోజుల క్రితం చికెన్ సెంటర్‌లో కోడిని ఓ కుక్క చంపి తినేసింది. దీంతో, దుకాణ యజమాని ఆ మొత్తాన్ని అతడి జీతంలో మినహాయించాడు. ఇందుకు ఆ కుక్కే కారణమని భావించిన గోపీకృష్ణ దాన్ని దారుణంగా పొట్టనపెట్టుకున్నాడు. మూగజీవాన్ని కర్కశంగా మట్టుపెట్టిన నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని జంతు ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు.

Pregnant Dog Killed
Guntur District
Andhra Pradesh
Crime News

More Telugu News