2019లో మంగళగిరిలో లోకేశ్ ఓడిపోయాక సేఫ్ సీటు చూసుకోమని సూచించారు: నారా బ్రాహ్మణి
- మంగళగిరి ప్రజలను తన కుటుంబ సభ్యులుగా లోకేశ్ భావిస్తున్నారన్న భార్య
- అందుకే మళ్లీ మంగళగిరిలో పోటీ చేస్తున్నారని వెల్లడి
- ప్రభుత్వ సహకారం లేకపోయినా ఐదేళ్లుగా అనేక సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తున్నారని వ్యాఖ్య
బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా సేవా కార్యక్రమాలు చేయగలుగుతున్నానంటే అది కేవలం నారా లోకేశ్ మద్దతే కారణమని బ్రాహ్మణి అన్నారు. తనకు అందించిన మద్దతునే మంగళగిరి నియోజకవర్గంలోని మహిళలందరికీ అందించాలని లోకేశ్ భావిస్తున్నారని, ఇదే ఆయన విజన్ అని ఆమె అన్నారు. గతంలో హెరిటేజ్ కంపెనీలో తనతో పాటు నారా లోకేశ్ కూడా బాధ్యతలు చూశారని, మహిళలు రాత్రీపగలు కష్టపడి గ్రామాల్లో పాలు ఉత్పత్తి చేసి హెరిటేజ్ కంపెనీకి అందిస్తే వారికి మంచి ఆదాయం దక్కేలా చూసేవారమని తెలిపారు. ఆదాయంతో పాటు వారి గ్రామాల్లో, సమాజంలో, వారి కమ్యూనిటీల్లో వారి విలువ చాలా పెరిగిందని, అది చూసి తమకు చాలా సంతృప్తిగా అనిపించేదని చెప్పారు. ముందు ముందు మహిళలకు ఏం చేసినా వారిమీద సానుకూల ప్రభావం ఉండేలే, ఆదాయం వచ్చేలా ఉండాలని అప్పుడే నిర్ణయించుకున్నామని ఆమె వెల్లడించారు.
నాడు తాము పొందిన సంతృప్తి కంటే స్త్రీ శక్తి పథకం ద్వారా మరింత ఎక్కువ సంతృప్తిని కలుగుతుందని నారా బ్రాహ్మణి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ పథకాన్ని రూపొందించినందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. మంగళగిరిలోని మహిళలు అందరూ తమ కాళ్లపై తాము నిలబడాలనేది నారా లోకేశ్ విజన్ అని అన్నారు.