కన్నబాబు... ఏం బతుకు నీది... చిరంజీవిని ఆ నీచుడు అవమానిస్తుంటే సిగ్గనిపించలేదా?: పవన్ కల్యాణ్

  • కాకినాడ రూరల్ లో వారాహి విజయభేరి సభ
  • కురసాల కన్నబాబుపై నిప్పులు చెరిగిన పవన్ కల్యాణ్
  • చిరంజీవి పడేసిన భిక్షతో నాయకుడివి అయ్యావంటూ తీవ్ర వ్యాఖ్యలు
కాకినాడ రూరల్ వారాహి విజయభేరి సభలో జనసేనాని పవన్ కల్యాణ్ స్థానిక ఎమ్మెల్యే కురసాల కన్నబాబును టార్గెట్ చేశారు. ప్రజల కోసం బతకాలి అనే ఒక స్ఫూర్తి తనను రాజకీయాల్లోకి తీసుకొచ్చిందని, కానీ తమ వద్ద డొక్కు స్కూటర్ పై తిరిగే కన్నబాబు ఇవాళ పెద్ద నాయకుడు అయిపోయాడని మండిపడ్డారు. 

తాను మాత్రం ఆశయం కోసం నిలబడి దశాబ్దకాలంగా నలిగిపోయానని, అందరితోనూ మాటలు అనిపించుకున్నానని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. చిరంజీవి వల్ల కురసాల కన్నబాబు రాజకీయ నేత అయ్యాడని తెలిపారు. చిరంజీవి పడేసిన భిక్షతో ఇవాళ వైసీపీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నాడని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

నాడు చిరంజీవిని జగన్ అవమానించారని, వాస్తవానికి అది నిర్మాతలకు సంబంధించిన విషయం అని, అయినా చిరంజీవి ముందుకొచ్చారని పవన్ పేర్కొన్నారు. "నాడు చిరంజీవిని, మహేశ్ బాబును, ప్రభాస్ ను జగన్ అహంకారంతో పిలిపించారు. వారిని కూర్చోబెట్టి, మీరు నన్ను బతిమాలండి అని చెప్పి దాన్ని వీడియో తీశారు. ఆ వీడియోను బయటికి పంపించారు. 

కన్నబాబును ఒకటే అడుగుతున్నా... సిగ్గుందా కన్నబాబూ నీకు? ఏం బతుకు నీది? ఆ నీచుడు చిరంజీవిని అవమానిస్తుంటే సిగ్గుగా అనిపించలేదా నీకు? చిరంజీవి పెట్టిన రాజకీయ భిక్ష వల్లే కదా నువ్వు రాజకీయ నేత అయింది" అంటూ పవన్ కల్యాణ్ నిప్పులు చెరిగారు.

Pawan Kalyan
Kurasala Kannababu
Chiranjeevi
Kakinada Rural
Varahi Vijayabheri
Janasena

More Telugu News