Whatsapp: వాట్సాప్​ కు, భారత ప్రభుత్వానికి మధ్య వివాదమేంటి? ఎండ్​ టు ఎండ్​ ఎన్​ క్రిప్షన్​ ఏంటి?

  • యూజర్ల మధ్య పూర్తిస్థాయిలో ప్రైవసీ అందిస్తున్న వాట్సాప్
  • వాట్సాప్ కాల్స్, మెసేజీల వివరాలను మధ్యలో చూసేందుకు వీలుకుదరకుండా క్రిప్టోగ్రఫిక్ లాకింగ్
  • ఈ ఎన్ క్రిప్షన్ ను తొలగించాలని కోరుతున్న భారత ప్రభుత్వం
what is end to end encryption the main issue between whatsapp and government of india

వాట్సాప్ లో అందిస్తున్న ‘ఎండ్ టు ఎండ్ ఎన్ క్రిప్షన్ (ఈ2ఈఈ)’ విషయంలో భారత ప్రభుత్వానికి, వాట్సాప్ యాజమాన్య సంస్థ ‘మెటా’కు మధ్య కొన్ని రోజులుగా వివాదం కొనసాగుతోంది. దీనిపై వాట్సాప్ సంస్థ చట్టపరంగా పోరాటానికి కూడా దిగింది. భారత ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే.. ఇండియాలో తమ సేవలను నిలిపివేస్తామని కూడా హెచ్చరించింది. అసలు ఏమిటీ వివాదం.. ‘ఈ2ఈఈ’ అంటే ఏమిటి? అనే వివరాలలోకి వెళితే..

ఈ2ఈఈ అంటే ఏమిటంటే..

  • వాట్సాప్ సంస్థ తమ యాప్ లో ‘ఎండ్ టు ఎండ్ ఎన్ క్రిప్షన్’ సౌకర్యాన్ని అందిస్తోంది.
  • అంటే ఒక యూజర్ నుంచి పంపిన చాటింగ్ టెక్ట్స్, డేటా ఏదైనా అక్కడే లాక్ అయిపోతుంది. తిరిగి ఆ డేటా ఏ యూజర్ కైతే పంపారో వారి వద్దకు చేరాకే తిరిగి అన్ లాక్ అవుతుంది.
  • అంటే ఒక యూజర్ మొబైల్ లో లాక్ అయిపోయి ట్రాన్స్ ఫర్ అయిన డేటా.. మరో యూజర్ మొబైల్ లోకి వెళ్లిన తర్వాతే అన్ లాక్ అయి డిస్ప్లే అవుతుంది.
  • మధ్యలో ఈ డేటాను ఎవరూ చూడటానికి, అందులోని అంశాలను తెలుసుకోవడానికి వీలవదు. ఇదంతా ఆటోమేటిగ్గా జరిగిపోతుంది. 
  • ఇది ‘క్రిప్టోగ్రఫిక్ ప్రోగ్రామింగ్ లాక్’.. పంపే ప్రతి మెసేజీకి, డేటాకు వేర్వేరు లాక్ క్రియేట్ అవుతుంది. పంపే యూజర్, రిసీవ్ చేసుకునే యూజర్ యాప్ లలో మాత్రమే అది యాక్టివేట్ అవుతుంది.
  • వాట్సాప్ సంస్థ కూడా ఈ మెసేజీలు, కాల్స్, డేటాను చూడలేదు.

భారత ప్రభుత్వం అడుగుతున్నదేంటి?
వాట్సాప్ అందిస్తున్న ‘ఎండ్ టు ఎండ్ ఎన్ క్రిప్షన్’ను తొలగించాలని భారత ప్రభుత్వం కోరుతోంది. వాట్సాప్ లో సర్క్యులేట్ అవుతున్న వివరాలను మధ్యలో గమనించగలిగేందుకు అవకాశం ఉండాలని వాదిస్తోంది. సమస్యాత్మక, వివాదాస్పద అంశాలు సర్క్యులేట్ కాకుండా ఉంటాయని అంటోంది.

వాట్సాప్ సంస్థ ఏమంటోంది?
తాము వినియోగదారుల ప్రైవసీకి ప్రాధాన్యత ఇస్తామని.. ఎండ్ టు ఎండ్ ఎన్ క్రిప్షన్ ను తొలగించలేమని వాట్సాప్ స్పష్టం చేస్తోంది. చట్ట ప్రకారం దర్యాప్తు ఏజెన్సీలు కోరితే.. ఎవరైనా యూజర్ కు సంబంధించిన ఎన్ క్రిప్షన్ ను తొలగించడం, ఇతర చర్యల ద్వారా సహకరిస్తామని స్పష్టం చేస్తోంది. అయితే భారత ప్రభుత్వం మాత్రం మొత్తంగా ఎన్ క్రిప్షన్ ను తొలగించాలని డిమాండ్ చేస్తోంది.

More Telugu News