Veer Bahadur singh Purvanchal university scam: పరీక్షల్లో ‘జై శ్రీరామ్’ అని రాసిన వాళ్లకు ఫస్ట్ క్లాస్.. యూపీ యూనివర్సిటీలో కొత్త స్కామ్

UP Students Clear Exam With Jai Shri Ram Answers Professors Suspended
షార్ట్స్‌లో చూడండి
ఉత్తరప్రదేశ్‌లోని వీర్‌బహదూర్ సింగ్ పూర్వాంచల్ యూనివర్సిటీలో తాజాగా షాకింగ్ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. కట్టుతప్పిన కొందరు ప్రొఫెసర్లు డబ్బులు తీసుకుని విద్యార్థులను పాస్ చేసినట్టు అక్కడి విద్యార్థి సంఘం నాయకుడు ఒకరు ఆరోపించారు. డబ్బులు తీసుకుని ఏం రాసినా పాస్ చేసేశారని స్టూడెంట్ లీడర్ దివ్యాన్షూ సింగ్ మండిపడ్డాడు. జై శ్రీరామ్ నినాదం, క్రికెటర్ల పేర్లు, పాటలు.. ఇలా నోటికొచ్చింది రాసిన విద్యార్థులు పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించారని, కొందరికి 60 శాతానికి పైగా మార్కులు వచ్చాయని కూడా పేర్కొన్నారు. ఆర్టీఐ చట్టం కింద కొన్ని సమాధాన పత్రాలను పరిశీలించగా ఈ దారుణం వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తోంది. యూనివర్సిటీకి చెందిన ఇద్దరు ప్రొఫెసర్లు కూడా సస్పెన్షన్‌కు గురయ్యారు. 

యూనివర్సిటీ ప్రొఫెసర్ల బాగోతం గురించి దివ్యాన్షూ సింగ్ ప్రధాని, రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు యూనివర్సిటీ వీసీకి కూడా లేఖ రాశాడు. ప్రొఫెసర్లు, యూనివర్సిటీ సిబ్బంది కుమ్మక్కై సున్నా మార్కులు రావాల్సిన విద్యార్థులను కూడా ఫస్ట్ క్లాస్‌లో పాస్ చేశారని ఆరోపించాడు. 

ఈ ఉదంతంపై యూనివర్సిటీ వీసీ వందన సింగ్ స్పందిస్తూ.. ఆరోపణల నిగ్గు తేల్చేందుకు ఓ ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. విద్యార్థులకు అదనపు మార్కులు ఇచ్చిన విషయాన్ని కమిటీ తన రిపోర్టులో పేర్కొందని అన్నారు. సమాధాన పత్రాల్లో జైశ్రీరామ్ నినాదాల గురించి ప్రస్తావించగా తాను ఆ పత్రాలను ఇంకా చూడలేదని వీసీ తెలిపారు. కానీ అసంబద్ధ సమాధానాలకు మార్కులు కేటాయించినట్టు ఓ సమాధాన పత్రాన్ని తాను చూసినట్టు తెలిపారు. ఆ సమాధాన పత్రంలోని చేతిరాత కూడా అర్థం కాని విధంగా ఉందని వ్యాఖ్యానించారు. మరోవైపు ఘటనపై గవర్నర్ కార్యాలయం కూడా స్పందించింది. ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ వీసీకి లేఖ రాసింది.
Go Back to Shorts
Veer Bahadur singh Purvanchal university scam
Jai Shree Ram
Answersheets
RTI Act

More Telugu News