Supreme Court: వీవీప్యాట్ల లెక్కింపుపై సుప్రీం సంచలన తీర్పు

  • వంద శాతం లెక్కింపు కుదరదని స్పష్టం చేసిన అత్యున్నత న్యాయస్థానం
  • ఈవీఎంలో పోలైన ఓట్లను వీవీప్యాట్ స్లిప్పులతో సరిపోల్చాలన్న పిటిషన్ల తిరస్కరణ
  • తీర్పు వెలువరించిన జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం
Supreme Court verdict on EVM VV Pats

ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం) లో పోలైన ఓట్లను వీవీప్యాట్ స్లిప్పులతో వంద శాతం సరిపోల్చడం కుదరదని అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం తీర్పు చెప్పింది. ఈమేరకు ప్రతిపక్షాలు దాఖలు చేసిన పిటిషన్లను తిరస్కరించింది. లోక్ సభ ఎన్నికల వేళ వీవీప్యాట్ స్లిప్పులపై సంచలన తీర్పు వెలువరించింది. ప్రస్తుతం కొనసాగుతున్న పద్ధతి బాగుందని పేర్కొంటూ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం ఏకాభిప్రాయంతో రెండు తీర్పులు వెలువరించింది.

ఈవీఎంలతో పోలింగ్ నిర్వహించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పేపర్ బ్యాలెట్ ఓటింగ్ నిర్వహించాలనే డిమాండ్ ను కూడా సుప్రీం ధర్మాసనం ఈ సందర్భంగా తోసిపుచ్చింది. ప్రతిపక్షాలు సహా పలువురు దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు విస్తృతంగా విచారణ జరిపింది. ఈ సందర్భంగా ప్రొటోకాల్‌లు, సాంకేతిక అంశాలపై ఎన్నికల సంఘానికి పలు ప్రశ్నలు సంధించింది. పోలింగ్ నిర్వహణ, ఈవీఎంల పనితీరుపై ఎన్నికల సంఘం నుంచి ధర్మాసనం వివరణ తీసుకుంది. అనంతరం తీర్పును రిజర్వ్‌ చేసిన ద్విసభ్య ధర్మాసనం.. తాజాగా తీర్పు వెలువరించింది.

విచారణ సందర్భంగా కోర్టులో ఎన్నికల సంఘం వివరణ ఇస్తూ.. ప్రస్తుతం ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో ఐదు ఈవీఎంలలో పోలైన ఓట్లను వీవీప్యాట్ స్లిప్పులతో సరిపోల్చుతున్నట్లు తెలిపింది. పిటిషన్ దారులు డిమాండ్ చేస్తున్నట్లు వంద శాతం స్లిప్పులను సరిపోల్చడం సాధ్యం కాదని వివరించింది. ఈవీఎంలపై ట్యాంపరింగ్ ఆరోపణలను తోసిపుచ్చింది. ట్యాంపరింగ్ అసాధ్యమంటూ అందుకోసం తీసుకున్న చర్యలను కోర్టుకు తెలిపింది. 

ఎన్నికల సంఘం వివరణతో పాటు పిటిషన్ దారుల సందేహాలపై సుదీర్ఘ విచారణ జరిపిన ద్విసభ్య ధర్మాసనం.. ఎన్నికల సంఘానికి పలు ఆదేశాలు జారీ చేసింది. ఈవీఎంలో సింబల్ లోడింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆ యూనిట్‌ను సీల్ చేయాలని, దానిని కనీసం 45 రోజుల పాటు భద్రపర్చాలని సూచించింది. ఫలితాలపై అభ్యంతరాలకు ఏడు రోజుల వ్యవధి ఇస్తూ.. అభ్యంతరాలు వ్యక్తమైన సందర్భంలో ఇంజనీర్ల బృందంతో మైక్రో కంట్రోలర్ ఈవీఎంలో బర్న్ చేసిన మెమరీని తనిఖీ చేయించాల్సిందిగా పేర్కొంది. అభ్యంతరం వ్యక్తం చేసిన అభ్యర్థి నుంచే దీనికయ్యే ఖర్చును వసూలు చేయాలని, ట్యాంపరింగ్ నిజమని తేలితే ఆ ఖర్చులు తిరిగివ్వాలని ఆదేశించింది. పేపర్‌ స్లిప్పులను లెక్కించేందుకు ఎలక్ట్రానిక్‌ మెషిన్‌ను ఉపయోగించాలన్న సూచనతో పాటు పార్టీ గుర్తుతో పాటు పక్కనే బార్‌కోడ్‌ ఏర్పాటు అంశాన్ని పరిశీలించాలని ఎన్నికల సంఘానికి జస్టిస్‌ ఖన్నా సూచించారు.

More Telugu News