KTR: తెలిసో తెలియకో తప్పు చేసి ఉంటే నన్ను క్షమించండి: తంగళ్లపల్లి ప్రజలతో కేటీఆర్

  • కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయలేదని విమర్శ
  • ఐదు నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం గురించి అందరికీ అర్థమైందన్న కేటీఆర్
  • బీజేపీ, కాంగ్రెస్ కుట్రలను తిప్పికొట్టాలని కేటీఆర్ పిలుపు
  • నేను చెప్పింది తప్పని నిరూపిస్తే రాజీనామా లేఖ సంజయ్ చేతిలో పెడతానని సవాల్
KTR seek apology of Karimnagar people

'తంగళ్ళపల్లి ప్రజలకు నా మీద కోపం వచ్చినట్లుగా ఉంది. మొన్నటి ఎన్నికల్లో కొంచెం మెజార్టీ తగ్గించారు. నేను తెలిసో తెలియకో తప్పు చేసి ఉంటే నన్ను క్షమించండి' అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని తంగళ్లపల్లిలో జరిగిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ... రూ.2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా, రైతు కూలీలకు, కౌలు రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదన్నారు. మహిళలకు రూ. 2500, రూ.4 వేల పెన్షన్, తులం బంగారం, స్కూటీలని రేవంత్ రెడ్డి చెప్పారని... కానీ అధికారంలోకి వచ్చాక వీటిని మరిచిపోయారని విమర్శించారు. రంగుల కలలాంటి సినిమాను చూపించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు.

ఈ ఐదు నెలల్లోనే ప్రజలందరికీ అన్ని విషయాలు అర్థమయ్యాయని... రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై అన్ని వర్గాలు కూడా కోపంతో ఉన్నాయన్నారు. కాంగ్రెస్ వాళ్లు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన అబద్దాలనే ఇంకా చెబుతున్నారన్నారు. ఆరు గ్యారంటీల్లో ఐదు పూర్తి చేసినట్లు ఇప్పటికీ రేవంత్ రెడ్డి బొంకుతున్నారని... కానీ మహిళలకు రూ.2500, రూ.4 వేల పెన్షన్, రైతు భరోసా వచ్చాయా? అని ప్రశ్నించారు. ఊసరవెల్లి రంగులు మార్చినట్లు రుణమాఫీపై తేదీలు మార్చుతున్నారని విమర్శించారు. ఈ  4 నెలల్లో రేవంత్ రెడ్డి చేసింది... చేస్తోంది దేవుడి మీద ఒట్లు... కేసీఆర్ మీద తిట్లు అన్నారు. లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు 10 నుంచి 12 సీట్లు ఇవ్వాలని... అప్పుడు కేసీఆర్ రాజకీయాలను శాసిస్తారన్నారు.

బీజేపీ, కాంగ్రెస్ కుట్రలను తిప్పికొట్టాలన్న కేటీఆర్

400 సీట్లు ఇస్తే బీజేపీ వాళ్లు రిజర్వేషన్లు రద్దు చేస్తామని చెబుతున్నారని... ఇలాంటి కుట్రను తిప్పికొట్టాలంటే పార్లమెంట్‌లో కచ్చితంగా బీఆర్ఎస్ ఉండాలన్నారు. కరీంనగర్‌లో కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థిని నిలబెట్టిందని... ఆయనను తంబళ్లపల్లి చౌరస్తాలో నిలబెడితే కాంగ్రెస్ వాళ్లే గుర్తు పట్టరని ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీ మన అవసరాలను కాదని గోదావరి నీళ్లను కర్ణాటక, తమిళనాడులకు తరలిస్తాడట అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి కుట్రలను ఎదుర్కోవడం బీజేపీ, కాంగ్రెస్ వాళ్లతో అయ్యే పని కాదన్నారు.

జూన్ 2 తర్వాత హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలని బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. మరోవైపు, ఒక్కో పార్లమెంట్ స్థానానికి ఒకటే జిల్లా ఉండాలని రేవంత్ రెడ్డి చెబుతున్నారన్నారు. ఇవి జరగకుండా ఉండాలంటే బీఆర్ఎస్ సభలో ఉండాలన్నారు. మనకు మనకు ఎన్ని గొడవలు ఉన్నా వాటిని పక్కన పెట్టాలని.. బీఆర్ఎస్‌ను గెలిపించుకోవాలని సూచించారు. సిరిసిల్లలో గత పదేళ్లు ఆత్మహత్యల మాట వినపడలేదని, ఇప్పుడు మళ్లీ నేతన్నలు ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ వచ్చింది కరవు వచ్చింది.. కరెంట్ లేదు... ఆత్మహత్యలు మొదలయ్యాయన్నారు. మళ్లీ  బీఆర్ఎస్ వస్తే తెలంగాణ పచ్చగా కళకళలాడుతుందన్నారు.

కరీంనగర్‌లో మనకు కాంగ్రెస్‌తో పోటీనే లేదని... బీజేపీతోనే పోటీ అన్నారు. పదేళ్ల కాలంలో బీజేపీ, బీఆర్ఎస్ పాలనను పోల్చి చూసుకోవాలన్నారు. బీజేపీకి ఎందుకు ఓటు వేయాలో బండి సంజయ్ చెప్పాలని నిలదీశారు. పని చేయకుండా మేం గుడి కట్టామని చెప్పి ఓట్లు అడుగుతున్నారని విమర్శించారు. గుడి కడితేనే ఓటు వేయాలంటే యాదాద్రిని కట్టిన కేసీఆర్‌కు ఓటేయాలన్నారు. దేవుడ్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయవద్దని హితవు పలికారు. కేసీఆర్ ప్రాజెక్టులు కూడా కట్టారన్నారు. చిన్న చిన్న కారణాలతో కేసీఆర్‌కు ఓటు వేయకుండా ఉందామా? అని ప్రశ్నించారు. మోదీ హయాంలో అన్ని ధరలు పెరిగాయన్నారు. అదానీ, అంబానీలకు దోచి పెడుతున్నారని ఆరోపించారు.

తప్పని నిరూపిస్తే రాజీనామా లేఖ సంజయ్ చేతిలో పెడతా

తాను చెప్పింది తప్పని బండి సంజయ్ నిరూపిస్తే తన రాజీనామా లేఖను ఆయన చేతిలో పెడతానని సవాల్ చేశారు. తెలంగాణకు మోదీ ఇచ్చింది గుండు సున్నా అన్నారు. లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిస్తేనే కాంగ్రెస్, బీజేపీ ఇచ్చిన హామీలను అమలు చేస్తాయన్నారు. కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే హామీలను అటకెక్కిస్తుందన్నారు. లుచ్చా మాటలు చెప్పే రేవంత్ రెడ్డికి, గాలి తిరుగుడు తిరిగే బండి సంజయ్‌కి బుద్ధి చెబుదామని పిలుపునిచ్చారు. కష్టపడి పని చేస్తే కేసీఆర్‌ను మళ్లీ రాజకీయాలు శాసించే పరిస్థితి వస్తుందన్నారు.

  • Loading...

More Telugu News