అప్పటిదాకా జగన్ బ్యాండెయిడ్ తియ్యడు.. నారా లోకేశ్ ఎద్దేవా

ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుండటంతో జగన్ గులకరాయి డ్రామాకు తెరతీశారని ఆరోపిస్తున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మరోసారి ఏపీ సీఎంపై విమర్శలు ఎక్కుపెట్టారు. వివేకా కుమార్తె సునీత డాక్టర్‌గా ఇచ్చిన సలహా తాలూకు వీడియోను ఆయన షేర్ చేశారు. 

వీడియోలో సునీత మాట్లాడుతూ ఓ డాక్టర్‌గా తాను జగన్‌కు ఓ సలహా ఇవ్వదలుచుకున్నట్టు తెలిపారు. దెబ్బలు తగిలిన చోట నిత్యం బ్యాండెయిడ్ పెట్టుకుంటే గాయం మానేందుకు చాలా సమయం పడుతుందని తెలిపారు. సెప్టిక్ అయ్యేందుకు కూడా ఛాన్సు ఉంటుందని అన్నారు.

బ్యాండెయిడ్ తీసేస్తే గాలి పారి గాయం త్వరగా మానుతుందని చెప్పారు. జగన్‌కు సరైన వైద్య సలహా అందుతున్నట్టు లేదని అభిప్రాయపడ్డారు. ఓ డాక్టర్‌గా ఇది చూసి తనకు బాధేస్తోందని చెప్పారు. కాబట్టి, బ్యాండెయిడ్ పెట్టుకోవద్దని జగన్‌కు సూచించారు. ఈ వీడియోను షేర్ చేసిన నారా లోకేశ్ జగన్‌పై సెటైర్లు పేల్చారు. ఎన్నికలయ్యే వరకూ సీఎం తన బ్యాండెయిడ్ తొలగించరని, ఇది తన ఛాలెంజ్ అని ఎద్దేవా చేశారు.


More Telugu News