Temple For Husband: అతడు ఆమె ’పతి‘ దేవుడే.. భర్తకు గుడికట్టిన భార్య!

  • మహబూబాబాద్‌ జిల్లాలోని పర్వతగిరి శివారు సోమ్లాతండాలో ఘటన
  • కరోనాతో మూడేళ్ల క్రితం మరణించిన భర్త
  • రూ. 20 లక్షల ఖర్చుతో భర్తకు గుడికట్టించిన భార్య
  • నిన్న భర్త నిలువెత్తు విగ్రహం ప్రతిష్ఠాపన
Wife built temple for husband in Mahbubabad District

‘పతియే ప్రత్యక్ష దైవం’ అన్న మాటను ఆమె నిజం చేసింది. మృతి చెందిన భర్త రూపం కళ్లముందే కదలాడుతుండటంతో దానిని శాశ్వతం చేసుకోవాలని భావించిన ఆమె భర్తకు గుడికట్టి తన కల నెరవేర్చుకుంది. 

మహబూబాబాద్ జిల్లా అదే మండలంలోని పర్వతగిరి శివారు సోమ్లాతండాకు చెందిన కల్యాణి-బానోతు హరిబాబుకు 27 ఏళ్ల క్రితం వివాహమైంది. సంతానం లేకున్నా అన్యోన్యంగా జీవించారు. హరిబాబు మూడేళ్ల క్రితం కరోనాతో మృతి చెందాడు. అప్పటి నుంచి ఆమె మానసికంగా కుంగిపోయారు. భర్తను తలచుకుని రోదించారు.

ఆయన రూపం ఈ భూమిపై శాశ్వతంగా నిలిచిపోవాలని భావించిన కల్యాణి.. భర్తకు గుడి కట్టాలని నిర్ణయించారు. దాదాపు రూ. 20 లక్షలతో భర్తకు గుడికట్టించారు. రాజస్థాన్‌లో విగ్రహం తయారుచేయించారు. నిన్న గుడిలో భర్త నిలువెత్తు విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. బంధువులతో కలిసి పూజలు చేశారు. ఘనంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి తండావాసులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

More Telugu News