ఎన్నికల నియమావళికి జగన్ అతీతుడా?: ప్రత్తిపాటి

టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌ల పై జగన్ పదేపదే చేస్తున్న వ్యాఖ్యలపై టీడీపీ నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తీవ్రస్థాయిలో  ధ్వజమెత్తారు. జగన్ అడ్డగోలు, అనుచిత వ్యాఖ్యలు ఎన్నికల సంఘానికి కనిపించలేదా? అని ప్రశ్నించారు. లేదంటే, ఎన్నికల నియమావళికి జగన్ అతీతుడా? అని నిలదీశారు. జగన్ అనుచిత వ్యాఖ్యలపై ఫిర్యాదు చేసినా ఈసీ పట్టించుకోవడం లేదని, ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని అన్నారాయన.

జగన్ మోహన్‌రెడ్డి కోడ్‌ను ఉల్లంఘించారని నిర్ధారణకు వచ్చినా ఈసీ ఎందుకు మౌనం పాటిస్తోందని ప్రశ్నించారు. ఇప్పటికైనా ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విజయవాడ సీపీ స్థానానికే మచ్చ తెచ్చిన కాంతిరాణాను బదిలీ చేయడం కాదని, తక్షణమే సస్పెండ్ చేయాలని కోరారు. అమాయకులు, విపక్షాలపై ఆయన అక్రమ కేసులు పెట్టి వేధించారని ప్రత్తిపాటి ఆరోపించారు.


More Telugu News