జగన్ పాలనపై నిరసనగా ఢిల్లీలో వేలు నరుక్కున్న ఏపీ మహిళ

AP Woman Cut Her Finger In Delhi In Protest
  • జగన్ అరాచకాలను దేశం దృష్టికి తీసుకురావాలనే చేశానంటూ వీడియో
  • రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ, సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ లను కలుస్తానని వెల్లడి
  • పత్తిపాడు నియోజకవర్గంలో జగన్ సర్కారు అరాచకాలకు అంతేలేకుండా పోయిందని ఆవేదన
ఆంధ్రప్రదేశ్ లో జగన్ సర్కారు అరాచక పాలన కొనసాగిస్తోందని ఆరోపిస్తూ, ఓ మహిళ ఏకంగా తన బొటనవేలును కోసుకుని నిరసన తెలిపింది. దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ లను కలుసుకునే ప్రయత్నం చేసింది. వారిని కలవడం వీలుకాకపోవడంతో జగన్ పాలనలో ఏపీలోని మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను దేశం దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో తన వేలును నరుక్కున్నట్లు తెలిపింది. ఈమేరకు సోషల్ మీడియాలో బాధితురాలు విడుదల చేసిన ఓ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

వీడియోలోని వివరాల ప్రకారం..
ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గానికి చెందిన కోపూరు లక్ష్మి ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు. పత్తిపాడు నియోజకవర్గంలో జగన్ ప్రభుత్వం అరాచకాలకు అంతులేకుండా పోయిందని ఆమె చెప్పారు. మహిళలతో గంజాయి అమ్మించడం మొదలుకొని తప్పుడు పత్రాలతో ఆస్తులను, భూములను కాజేయడం వంటి దారుణాలు ఎన్నో జరుగుతున్నాయని వాపోయారు. ఇదేమని ప్రశ్నించిన వారిపై దాడులు, కత్తులు, రాడ్లతో బెదిరించడం నిత్యకృత్యం అయిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

మహిళలపై ఎన్నో అరాచకాలకు పాల్పడుతున్నారని, వీటన్నింటినీ రాష్ట్రం, దేశం, ప్రపంచం దృష్టికి తీసుకెళ్లాలని ఢిల్లీకి వచ్చినట్లు పేర్కొన్నారు. ప్రెసిడెంట్, సీజేఐ, ప్రధాన మంత్రిని కలవాలని ప్రయత్నించినా సాధ్యంకాలేదని వివరించారు. దీంతో వారి ఆఫీసులలో వినతిపత్రాలు అందజేసి, తన వేలును కోసుకోవడం ద్వారా నిరసన తెలుపుతున్నానని చెప్పారు. తాను చేసిన పనికి అందరూ క్షమించాలంటూ కోపూరు లక్ష్మీ వీడియోలో కోరారు.

Go Back to Shorts
AP Woman
Finger
Cuts Own Finger
Jagan Govt
Protest
Delhi
Viral Videos

More Telugu News