ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్ తగ్గించేందుకు వైసీపీ కుట్ర చేస్తోంది: అశోక్ బాబు
- ఉద్యోగ సంఘాలు అప్రమత్తంగా ఉండాలన్న అశోక్ బాబు
- ఆర్వో, ఏఆర్వోలు ఫారం-12 తీసుకోవడంలేదని ఆరోపణ
- ఉద్యోగుల నుంచి ఫారం-12 తీసుకునే బాధ్యత రిటర్నింగ్ అధికారులదేనని స్పష్టీకరణ
ఏపీలో లక్షల సంఖ్యలో పోస్టల్ బ్యాలెట్లు ఉన్నాయని అశోక్ బాబు తెలిపారు. అందుకే ప్రభుత్వం దుర్మార్గంగా ఆలోచిస్తోందని, పోస్టల్ బ్యాలెట్ల తగ్గింపునకు ప్రయత్నిస్తోందని మండిపడ్డారు.
ఎందుకంటే... ఉద్యోగులు ఇవాళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు... ఒకట్రెండు శాతం మంది ప్రభుత్వానికి తొత్తులుగా ఉన్నారు తప్ప, మిగతా ఉద్యోగులు కానీ, టీచర్లు కానీ, పెన్షనర్లు కానీ, కార్మికులు కానీ... వీళ్లందరూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారని అశోక్ బాబు వివరించారు.
వ్యతిరేకత ఉన్నందున పోస్టల్ బ్యాలెట్లు తమకు ప్రతికూలంగా మారతాయని ప్రభుత్వం భావిస్తోందని, అందుకే కుట్రకు తెరలేపిందని అన్నారు. దీన్ని ఉద్యోగ సంఘాలు కూడా ఓ సవాల్ గా తీసుకోవాలని అశోక్ బాబు సూచించారు.
ఎన్నికల విధుల్లో ఉన్న ప్రతి ఒక్క ఉద్యోగి తాము విధులు నిర్వర్తిస్తున్న చోట ఫారం-12ను ఆర్వోకు గానీ, ఏఆర్వోకు గానీ ఇచ్చి రసీదు తీసుకోవాల్సిన అవసరం ఉందని అశోక్ బాబు స్పష్టం చేశారు.