Crime News: 6 నెలల గర్భిణీని మంచానికి కట్టేసి నిప్పంటించిన భర్త

  • పంజాబ్‌లో వెలుగుచూసిన దారుణ ఘటన
  • తీవ్ర వాగ్వాదం.. క్షణికావేశంతో ఘోరానికి పాల్పడ్డ నిందితుడు
  • మరో మూడు నెలల్లో కవలలకు జన్మనివ్వాల్సిన సమయంలో జరిగిన ఘోరం
husband tied 6 months pregnant woman to the bed and set her on fire

పంజాబ్‌లో అత్యంత దారుణమైన ఘటన వెలుగుచూసింది. కవల పిల్లలకు జన్మనివ్వాల్సిన ఓ గర్భిణిని ఆమె భర్త మంచానికి కట్టేసి నిప్పు అంటించాడు. దీంతో విలవిల్లాడుతూ ఆమె అక్కడికక్కడ ప్రాణాలు కోల్పోయింది. అమృత్‌సర్‌ సిటీకి సమీపంలోని బుల్లెనంగల్ గ్రామంలో ఈ దారుణం శుక్రవారం జరిగింది. మృతురాలు పంకీ, భర్త సుఖ్‌దేవ్ మధ్య కొంతకాలంగా ఘర్షణలు జరుగుతున్నాయి. శుక్రవారం కూడా వీరిద్దరూ గొడవపడ్డారు. దీంతో సుఖ్‌దేశ్ క్షణికావేశంతో ఘోరానికి ఒడిగట్టాడు. పింకీ వయసు 23 సంవత్సరాలు అని, ఆమె ప్రస్తుతం 6 నెలల గర్భవతి అని పోలీసులు వెల్లడించారు. శుక్రవారం భార్యాభర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందని, అనంతరం పింకీని మంచానికి కట్టేసి నిప్పంటించాడని వివరించారు.

సుఖ్‌దేవ్, పింకీల మధ్య విభేదాలు ఉన్నాయని, పలు విషయాలపై గొడవ పడేవారని పోలీసు అధికారులు చెప్పారు. శుక్రవారం కూడా ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందని, దారుణానికి ఒడిగట్టి సుఖ్‌దేవ్ పరారయ్యాడని అధికారులు వివరించారు. శనివారం సాయంత్రం సుఖ్‌దేవ్‌ని అరెస్ట్ చేశామని, కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని తెలిపారు.

కాగా ఈ దారుణ ఘటనపై నివేదిక ఇవ్వాలని పంజాబ్ పోలీసులను జాతీయ మహిళా కమిషన్ కోరింది. ఈ ఘటనపై కమిషన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఊహించలేని క్రూరత్వం ఇదని అభివర్ణించింది. ఈ ఘటనపై మూడు రోజుల్లోగా నివేదిక అందజేయాలని పంజాబ్ డీజీపీకి జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రేఖ శర్మ లేఖ రాశారు. నేరస్థుడిని అరెస్టు చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు జాతీయ మహిళ కమిషన్ ‘ఎక్స్’ వేదికగా వివరాలను వెల్లడించింది.

More Telugu News