YS Sharmila: నామినేషన్‌కు బయలుదేరే ముందు వైఎస్ షర్మిల ఎమోషనల్ పోస్ట్

  • దేవుడి దీవెనలు, నాన్న ఆశీర్వాదం, ప్రియమైన అమ్మ, ముద్దుల బిడ్డల శుభాకాంక్షలతో బయలుదేరానన్న షర్మిల 
  • న్యాయం కోసం విజయం వైపు అడుగు వేస్తున్నానని వ్యాఖ్య
  • ధర్మం వైపే కడప ప్రజలు నిలబడతారని ఆశిస్తున్నానన్న షర్మిల
YS Sharmila started Rally for nomination from Kadapa MP seat

ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కడప ఎంపీ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేసేందుకు బయలుదేరారు. తన నివాసం నుంచి భారీ ర్యాలీగా బయలుదేరిన ఆమె కొద్దిసేపట్లో నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ ఆఫీసర్‌కు సమర్పించనున్నారు. షర్మిల వెంట కాంగ్రెస్, సీపీఐ నాయకులతో పాటు వైఎస్ వివేకా కూతురు వైఎస్ సునీత కూడా ఉన్నారు.


కాగా నివాసం నుంచి బయలుదేరడానికి ముందు వైఎస్ షర్మిల సోషల్ మీడియా వేదికగా భావోద్వేగ పోస్ట్ షేర్ చేశారు. అపురూప ఘట్టం ఆవిష్కరించబోతున్న ఈ సందర్భంలో దేవుడి దీవెనలు, నాన్న ఆశీర్వాదం, ప్రియమైన అమ్మ, ముద్దుల బిడ్డల శుభాకాంక్షలు అందుకుని బయలుదేరానని షర్మిల పేర్కొన్నారు. ‘‘న్యాయం కోసం విజయం వైపు ఈ అడుగు వేస్తున్నాను. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ వివేకానంద రెడ్డిని మరిచిపోలేని ప్రజలు, అందరూ నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. ధర్మం వైపే మన కడప ప్రజలు నిలబడతారని ఆశిస్తుంది మీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ’’ అని షర్మిల వ్యాఖ్యానించారు. వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులు అర్పిస్తున్న ఫొటోలతో పాటు కొడుకు-కోడలు, కూతురు, తల్లి విజయమ్మ ఉన్న చిత్రాలను ఈ సందర్భంగా షర్మిల షేర్ చేశారు.

More Telugu News