Narendra Modi: పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్‌లపై నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రశంసలు

  • 1991లో ఆర్థిక సరళీకరణలు ప్రారంభించి వ్యవస్థను గాడిలో పెట్టారన్న కేంద్రం
  • లైసెన్స్ రాజ్‌కు ముగింపు పలికి ఆర్థిక సరళీకరణకు మార్గదర్శకులుగా నిలిచారని వ్యాఖ్య
  • ఐఆర్డీఏ, 1951 చట్టం... లైసెన్స్ రాజ్‌ను తలపిస్తోందని సుప్రీంకోర్టు విమర్శించిన నేపథ్యంలో ప్రభుత్వం స్పందన
Centre Big Praise For Former PM Manmohan Singh In Supreme Court

పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్‌లపై నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రశంసలు కురిపించింది. 1991లో ఆర్థిక సరళీకరణలు ప్రారంభించి... ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టారని పేర్కొంది. లైసెన్స్ రాజ్‌కు ముగింపు పలికి ఆర్థిక సరళీకరణకు మార్గదర్శకులుగా నిలిచారన్నారు. సుప్రీంకోర్టులో ఓ కేసు విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఈ అభిప్రాయం వ్యక్తం చేసింది. 1991లో ప్రవేశపెట్టిన సంస్కరణలు ఎన్నో చట్టాలను సరళీకరించాయని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా పేర్కొన్నారు.

కంపెనీ చట్టం, వాణిజ్య పద్ధతుల చట్టం సహా ఎంఆర్టీపీ వంటి ఆర్థిక సంస్కరణలను తీసుకువచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది. ఇవి ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రయివేటీకరణకు దారి తీశాయని... తద్వారా లైసెన్స్ రాజ్ యుగానికి ముగింపు పలికేలా చేసిందన్నారు. అయితే, ఆ తర్వాత మూడు దశాబ్దాల్లో వచ్చిన ప్రభుత్వాలు పరిశ్రమల (డెవలప్‌మెంట్ అండ్ రెగ్యులేషన్) చట్టం, 1951ని సవరించడంపై దృష్టి సారించాల్సిన అవసరం రాలేదన్నారు. IDRA, 1951 చట్టం... లైసెన్స్ రాజ్ రోజులను ప్రతిబింబిస్తోందని సుప్రీంకోర్టు ధర్మాసనం విమర్శించిన నేపథ్యంలో సొలిసిటర్ జనరల్ పైవిధంగా స్పందించారు.

ఆర్థిక సంస్కరణల వల్ల పలు మార్పులు వచ్చాయని... కానీ IDRA మాత్రం అలాగే ఉండిపోయిందని తెలిపారు. వివిధ పరిశ్రమలపై కేంద్రం గణనీయమైన నియంత్రణను కొనసాగించడానికి ఇది వీలు కల్పిస్తోందని తుషార్ మెహతా తెలిపారు. కరోనా సమయంలో దేశ ప్రయోజనాల దృష్ట్యా పరిశ్రమలను నియంత్రించే అధికారం కేంద్రం కలిగి ఉందన్నారు.

More Telugu News