ఐపీఎల్ ట్రోఫీ ఆ జట్టుదేనట.. తేల్చేసిన ఢిల్లీ కోచ్ రికీ పాంటింగ్
- రసవత్తరంగా సాగుతున్న ఐపీఎల్ మ్యాచ్లు
- ఈసారి భారీ స్కోర్లతో బద్దలవుతున్న రికార్డులు
- బౌలింగ్పై ఎదురుదాడికి దిగిన జట్టే ట్రోఫీ గెలుస్తుందని పాంటింగ్ జోస్యం
ఐపీఎల్లో అత్యధిక పరుగుల రికార్డును సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు రెండుసార్లు నెలకొల్పింది. హైదరాబాద్లో ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో 277/3 పరుగులు చేసి, 2013లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చేసిన 263/5 పరుగుల రికార్డును తుడిచిపెట్టేసింది. ఆ మ్యాచ్లో ఆర్సీబీ బ్యాటర్ క్రిస్ గేల్ 175 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. హైదరాబాద్ జట్టు మరోమారు తన రికార్డును తానే బద్దలుగొట్టింది. బెంగళూరులో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో ఏకంగా 287/3 పరుగులు చేసింది.
నేడు ఢిల్లీ కేపిటల్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య అహ్మదాబాద్లో మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో పాంటింగ్ మాట్లాడుతూ.. హైదరాబాద్ రెండుసార్లు భారీ స్కోర్లు సాధించిందని, కోల్కతా జట్టు తమపై 272/7 పరుగులు చేసిందని గుర్తుచేశాడు. జట్ల బ్యాటింగ్లో ఇంపాక్ట్ ప్లేయర్ ప్రభావం ఎక్కువగా ఉందని అభిప్రాయపడ్డాడు. ఈసారి బౌలర్లపై ఎదురుదాడికి దిగిన జట్టే ట్రోఫీ సాధిస్తుందని స్పష్టం చేశాడు. కాగా, ఢిల్లీ కేపిటల్స్ మాత్రం ఈ సీజన్లో పడుతూ లేస్తూ ఉంది. ఇప్పటి వరకు ఆరు మ్యాచ్లు ఆడిన డీసీ నాలుగింటిలో ఓడి పట్టికలో ఏడో స్థానంలో ఉంది.