Jagan: సీఎం జగన్‌పై రాళ్లదాడి వెనక టీడీపీ హస్తం: వైసీపీ

  • ‘సిద్ధం’ యాత్రకు వస్తున్న స్పందన చూసి ఓర్వలేకే పిరికిచర్యకు పాల్పడ్డారని ఆరోపణ
  • ఇలాంటి చర్యలతో గెలుపు రాదని గుర్తించాలని హితవు
  • దాడిని ఖండించిన విజయసాయి రెడ్డి
YSR Congress blames TDP for attack on Jagan

ఏపీ సీఎం జగన్‌పై విజయవాడలో రాయి దాడి వెనక టీడీపీ హస్తం ఉందని వైసీపీ అగ్గిమీదగుగ్గిలమైంది. శనివారం ‘మేమంతా సిద్ధం’ ర్యాలీ సందర్భంగా బస్‌పై ఉన్న సీఎం జగన్‌పై గుర్తుతెలియని వ్యక్తి రాయి విసిరిన విషయం తెలిసిందే. సీఎంకు రాయి తగిలి ఎండమ కంటి పైభాగాన నుదురుపై గాయం కావడంతో వైద్యులు కుట్లు వేసి చికిత్స చేశారు. ఈ ఘటనపై వైసీపీ వర్గాలు మండిపడుతున్నాయి. టీడీపీ కంచుకోటలో సీఎం జగన్ యాత్రకు ప్రజల నుంచి భారీ స్పందన చూసి ఓర్వలేకే టీడీపీ ఈ దాడి చేయించిందని ఆరోపించాయి.

సీఎంపై దాడిని వైసీసీ ఎంపీ విజయసాయి రెడ్డి ఖండించారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఎప్పుడూ అభివృద్ధికారక రాజకీయాలను నమ్మలేదంటూ ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘హింస, కుట్రలతో పిరికిపంద రాజకీయాలు చేస్తున్నట్టు ఈ ఘటనతో మరోసారి రుజువైంది’’ అని ఆయన పోస్ట్ పెట్టారు. జగన్ యాత్ర సక్సెస్ కావడం చూసి ఓర్వేలేక ఈ పిరికిపంద చర్యకు పాల్పడ్డారని వైసీపీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ వ్యాఖ్యానించారు. ఇలాంటి దాడులతో ఎన్నికల్లో గెలవలేరనేది టీడీపీ గుర్తించాలని అన్నారు. నిందితులను గుర్తించి, అరెస్టు చేయాలని పోలీసులను కోరారు.

More Telugu News