ఉదయ్‌పూర్‌ త్రిపుర సుందరి ఆలయంలో షార్ట్ వీడియోల చిత్రీకరణపై నిషేధం

  • ఆలయ ప్రాంగణంలో అభ్యంతరకర రీతిలో చిత్రీకరించిన వీడియో వైరల్
  • ఘటనపై సీరియస్ అయిన అధికారులు, 
  • ఆలయంలో షార్ట్ వీడియోల చిత్రీకరణను నిషేధిస్తూ ఉత్తర్వులు
  • నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక
రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లోగల త్రిపుర సుందరి ఆలయ పరిసరాల్లో షార్ట్ వీడియోలు, రీల్స్ చిత్రీకరణపై అధికారులు నిషేధం విధించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై భారీ జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ఆలయ ప్రాంగణంలో అభ్యంతరకర రీతిలో తీసిన ఓ షార్ట్ వీడియో ఇటీవల వైరల్ కావడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. 

‘‘ఆలయంలో అసభ్యకర పాటలు, నృత్యాలతో షార్ట్ వీడియోలు, రీల్స్ తీయడంపై నిషేధం విధించాం. ఆలయం బ్యాక్‌ గ్రౌండ్‌గా వీడియోలు తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తే ప్రజల మనోభావాలను దెబ్బతీయొద్దు’’ అని అధికారులు నోటీసు విడుదల చేశారు. నిబంధనలు ఉల్లంఘించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.   

భారత ఉపఖండంలోని 51 శక్తిపీఠాల్లో త్రిపుర సుందరి ఆలయం ఒకటన్న విషయం తెలిసిందే. ఆలయ ప్రాంగణం కూర్మాకారంలో ఉండటంతో ఈ ఆలయం కూర్మపీఠంగా ప్రసిద్ధికెక్కింది. ఆలయంలో బౌద్ధ స్తూప లక్షణాలు కూడా కనిపిస్తాయి. ఆలయ ప్రధాన ద్వారం దక్షిణానికి అభిముఖంగా ఉండటం ఈ ఆలయం మరో ప్రత్యేకత. ఉత్తర దిక్కున కూడా ఓ చిన్న ప్రవేశద్వారం ఉంది. మధ్యయుగాల నాటి బెంగాలీ ఛార్ చాలా నిర్మాణ శైలిలో ఈ ఆలయాన్ని నిర్మించారు. 

ధాన్య మాణిక్య అనే రాజు 1501లో ఈ దేవాలయాన్ని నిర్మించారు. తొలుత విష్ణువు కోసం ఆలయం నిర్మించినప్పటికీ రాజుకు కలలో అమ్మవారు కనిపించడంతో ఆయన శక్తి పీఠాన్ని ఏర్పాటు చేశారు. బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్‌నుంచి తెప్పించిన కస్తి శిలతో విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

Tripura Sundari Temple
Udaipur
Rajasthan
Ban on Short Videos

More Telugu News