Manjummel Boys: 'మంజుమ్మల్ బోయ్స్' సినిమా ప్రదర్శనలను ఆపేసిన పీవీఆర్

  • తెలుగులో కూడా మంచి వసూళ్లను సాధిస్తున్న 'మంజుమ్మల్ బోయ్స్'
  • సినిమా ప్రదర్శనలను ఆపేయడంపై మైత్రీ మూవీ మేకర్స్ ఆగ్రహం
  • మలయాళ నిర్మాతతో వివాదమే కారణమన్న పీవీఆర్
PVR stopped Manummel Boys screening

మలయాళంలో ఘన విజయాన్ని సాధించిన 'మంజుమ్మల్ బోయ్స్' చిత్రం తెలుగు వర్షన్ లో కూడా సత్తా చాటింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం విజయాన్ని అందుకుంది. విడుదలైన అన్ని కేంద్రాల్లో మంచి వసూళ్లు సాధిస్తోంది. అయితే ఈ చిత్ర ప్రదర్శనలను పీవీఆర్ మల్టీప్లెక్స్ ఆపేసింది. మలయాళ నిర్మాతతో ఉన్న వివాదం కారణంగానే సినిమా ప్రదర్శనను నిలిపివేశామని పీవీఆర్ తెలిపింది. 

మరోవైపు సినిమా ప్రదర్శనను నిలిపి వేయడంపై మైత్రీ మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూటర్ శశిధర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మలయాళ నిర్మాతతో వివాదం ఉంటే తెలుగు వర్షన్ ను ఎలా ఆపేస్తారని ఆయన ప్రశ్నించారు. మంచి వసూళ్లను సాధిస్తున్న సమయంలో సినిమా ప్రదర్శనను ఆపేయడం సరికాదని... ప్రదర్శనలు ఆపితే తాము ఆర్థికంగా నష్టపోతామని చెప్పారు. ఈ విషయాన్ని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ దృష్టికి కూడా తీసుకెళ్లారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన ఫిల్మ్ ఛాంబర్... కాసేపట్లో అత్యవసరంగా సమావేశం కానుంది.

More Telugu News