Daggubati Purandeswari: తుపానులను మించిన విపత్తు ఈ వైసీపీ పాలన: నిడదవోలులో పురందేశ్వరి ప్రసంగం

  • నిడదవోలులో ప్రజాగళం సభ
  • చంద్రబాబు, పవన్ తో పాటు హాజరైన పురందేశ్వరి
  • నిడదవోలులో జనసాగరం కనిపిస్తోందన్న ఏపీ బీజేపీ చీఫ్
  • మే 13న మన సత్తా ఏంటో వైసీపీ నేతలకు చూపించాలని పిలుపు
Purandeswari speech in Nidadavolu

నిడదవోలులో నిర్వహించిన ప్రజాగళం సభకు చంద్రబాబు, పవన్ కల్యాణ్ తో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగిస్తూ, ఏపీలో వైసీపీ ప్రభుత్వాన్ని ఎప్పుడెప్పుడు సాగనంపుదామా అన్న బలమైన కోరికతో ప్రజలు ఇవాళ ఈ సభకు జనసాగరంలా తరలివచ్చినట్టు కనిపిస్తోందని అన్నారు. 

తుపానులను మించిన వైపరీత్యం ఈ వైసీపీ పాలన అని పురందేశ్వరి అభివర్ణించారు. ఐదేళ్ల కిందట వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రం కుదేలైందని అన్నారు. ఏపీ అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, అభివృద్ధి అనే పదానికి తావు లేకుండా పోయిందని, పరిశ్రమల రాక మన బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు లేకుండా పోయాయని పురందేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. 

ఒకానొక దశలో అభివృద్ధికి మారుపేరుగా ఉన్న ఏపీ ఇవాళ తలలేని మొండెంలా మిగిలిపోయిందని అన్నారు. రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోవడం ఎంత దౌర్భాగ్యమో మనందరం గుర్తించాలని, అలాంటి వేళ మనమందరం నడుం బిగించాల్సిన అవసరం ఆసన్నమైందని పేర్కొన్నారు. 

రాష్ట్రంలో నాణ్యత లేని మద్యాన్ని పేదలతో తాగించి, మహిళల పుస్తెలు తెగినా ఫర్వాలేదు, మా జేబులు నిండితే చాలు అనే పరిస్థితులు చూస్తున్నాం... అని వివరించారు. రాష్ట్రంలో ఏ ఒక్క వర్గానికి న్యాయం చేసే పరిస్థితి లేదని విమర్శించారు. బీసీ కమిషన్ కు కేంద్రం చట్టబద్ధత ఇస్తే, రాష్ట్రంలోని బీసీ కమిషన్ కు చట్టబద్ధత ఇవ్వకుండా బీసీ వర్గాలకు వైసీపీ ఏ విధంగా అన్యాయం చేస్తోందో ఒక్కసారి గమనించాలని పిలపునిచ్చారు. 

ఎస్సీ వర్గానికి చెందిన డ్రైవర్ ను చంపి ఎమ్మెల్సీ అనంతబాబు డోర్ డెలివరీ చేస్తే ఆ కుటుంబానికి ఇప్పటివరకు న్యాయం జరగలేదని పురందేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే కచ్చితంగా మార్పు అవసరం ఉందని అన్నారు.

ఇవాళ ప్రజల్లో కనిపిస్తున్న ఉత్సాహం చూస్తుంటే... నరేంద్ర మోదీ గారి స్ఫూర్తి, చంద్రబాబు గారి యుక్తి, పవన్ కల్యాణ్ గారి శక్తి ఈ సభా ప్రాంగణంలో కనిపిస్తోందని వివరించారు. ఈ సమరోత్సాహాన్ని ఇదే విధంగా కొనసాగించాలని, మే 13న మన సత్తా ఏంటో వైసీపీ నాయకులకు చూపించాలి అని పురందేశ్వరి పిలుపునిచ్చారు.

More Telugu News