Phone Tapping Case: 42 హార్డ్‌డిస్క్‌లు మూసీలో కలిపేశారు... ఫోన్ ట్యాపింగ్‌లో కీలకమైన పాత డేటా మాయం

  • ప్రభుత్వం మారడంతో 17 కంప్యూటర్లకు సంబంధించిన 42 హార్డ్ డిస్క్‌ల డేటాను మూసీలో కలిపిన వైనం
  • ఎస్ఐబీ సేకరించిన డేటా మొత్తాన్ని ధ్వంసం చేసిన ప్రణీత్ రావు గ్యాంగ్
  • డిసెంబర్ 4న హార్డ్ డిస్కులను ధ్వంసం చేసిన ప్రణీత్ రావు

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రభుత్వం మారడంతో 17 కంప్యూటర్లకు సంబంధించిన 42 హార్డ్ డిస్క్‌ల డేటాను మూసీలో కలిపినట్లుగా తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించి విలువైన సమాచారం వాటిలో ఉందని చెబుతున్నారు. ఎస్ఐబీ సేకరించిన డేటా మొత్తాన్ని ప్రణీత్ రావు గ్యాంగ్ ధ్వంసం చేసినట్లుగా చెబుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కొత్త కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి.

గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎస్ఐబీ డీఎస్పీగా ఉన్న ప్రణీత్ రావు చేసిన పనికి ఉన్నతాధికారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారట. కొన్నేళ్లుగా ఎస్ఐబీ ఎంతో శ్రమించి సేకరించిన పాత డేటా కూడా మిస్ అయినట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ కేసులో కీలక నిందితుడు ప్రణీత్ రావు డిసెంబర్ 4న 17 కంప్యూటర్లకు చెందిన 42 హార్డ్ డిస్క్‌లను ధ్వంసం చేశాడు. వీటి నుంచి డేటాను తిరిగి పొందే అవకాశం కూడా లేదని టెక్నికల్ నిపుణులు చెబుతున్నారు. మూసీలో కలిపిన హార్డ్ డిస్క్ శకలాల నుంచి కూడా సమాచారం సేకరించలేమని నిపుణులు స్పష్టం చేశారు.

ఇదిలా ఉండగా, ట్యాపింగ్ కోసం కన్వర్జెన్స్ ఇన్నోవేషన్ ల్యాబ్ సమకూర్చిన టూల్ వాడినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ల్యాబ్ డైరెక్టర్లుగా పాల్ రవికుమార్, బూసీ, శీవల్లి గోడి ఉన్నారు. వీరు మరో ఆరు సంస్థలకు సీఈవోలుగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వీరిని కూడా విచారించే అవకాశముంది. తొలుత ఎస్ఐబీలో ఆధారాల ధ్వంసం కేసులో అరెస్టయిన ప్రణీత్ రావును విచారించారు. ఈ క్రమంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెలుగు చూసింది. ఇదంతా నాటి ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు ఆధ్వర్యంలోనే జరిగినట్లు విచారణలో ప్రణీత్ రావు వాంగ్మూలం ఇచ్చారు.

More Telugu News