వైసీపీ గెలిచే అవకాశం లేదన్న ప్రశాంత్ కిశోర్ పై బొత్స ఫైర్

  • ప్యాకేజ్ తీసుకుని ప్రశాంత్ కిశోర్ మాట్లాడుతున్నారన్న బొత్స
  • లీడర్ కు, ప్రొవైడర్ కు తేడా తెలియకుండా మాట్లాడుతున్నారని విమర్శ
  • పీకే ఏది మాట్లాడినా ఎల్లో మీడియా ఫ్రంట్ పేజ్ లో వేస్తోందని మండిపాటు
ఈ ఎన్నికల్లో వైసీపీ మళ్లీ గెలవడం అసాధ్యమని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో ఆయన చేసిన వ్యాఖ్యలు వైసీపీ శిబిరాన్ని ఆగ్రహానికి గురి చేశాయి. తాజాగా ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ పీకేపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు కోసం ఏపీ రాజకీయాల గురించి ప్రశాంత్ కిశోర్ మాట్లాడుతున్నారని విమర్శించారు. విశాఖలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

ప్రశాంత్ కిశోర్ ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని బొత్స అన్నారు. లీడర్ కు, ప్రొవైడర్ కు తేడా తెలియకుండా మాట్లాడుతున్నారని చెప్పారు. జగన్ లీడర్ అయితే, చంద్రబాబు ప్రొవైడర్ అని అన్నారు. చంద్రబాబు నుంచి ప్యాకేజ్ తీసుకుని పీకే మాట్లాడుతున్నారని ఆరోపించారు. జగన్ నాయకత్వంలో గత ఐదేళ్లలో ఏపీ అన్ని రంగాల్లో ముందడుగు వేసిందని చెప్పారు. గతంలో ఏపీలో 16, 15 స్థానాల్లో ఉండేదని... ఇప్పుడు 4, 5 స్థానాల్లో ఉంటోందని తెలిపారు. జగన్ అమలు చేసిన సంస్కరణలతోనే ఇదంతా సాధ్యమయిందని చెప్పారు. 

పీకే ఏది మాట్లాడినా ఎల్లో మీడియా మొదటి పేజీలో వేసేస్తోందని బొత్స మండిపడ్డారు. ప్రశాంత్ కిశోర్ ప్యాకేజీ తీసుకుని పని చేస్తారని... ప్యాకేజీ ఇచ్చిన వాళ్లను ఇంద్రుడు, చంద్రుడు అని పొగుడుతారని చెప్పారు. ప్రజలకు సంక్షేమ పాలనను జగన్ అందిస్తున్నారనే విషయాన్ని పీకే గుర్తించాలని చెప్పారు. ఏ ఉద్దేశంలో ఈసీకి ఐపీఎస్ లపై ఫిర్యాదు చేశారని ప్రతిపక్ష కూటమిపై మండిపడ్డారు. ఐపీఎస్ లకు రాజకీయాలు అంటగట్టడం సరికాదని అన్నారు.


More Telugu News

Botsa Satyanarayana Jagan YSRCP Chandrababu Telugudesam Prashant Kishor