America: అమెరికా రోడ్డు ప్ర‌మాదంలో తెలుగు విద్యార్థి మృతి!

  • మృతుడు ఆచంట రేవంత్ స్వ‌స్థ‌లం బాప‌ట్ల జిల్లా ప‌ర్చూరు మండ‌లం బోడ‌వాడ‌
  • గ‌తేడాది డిసెంబ‌ర్‌లోనే ఎంఎస్ చేసేందుకు యూఎస్ వెళ్లిన రేవంత్‌
  • మాడిస‌న్ ప‌రిధిలోని డ‌కోట స్టేట్ యూనివ‌ర్సిటీలో చ‌దువుతున్న తెలుగు విద్యార్థి
  • పుట్టిన‌రోజు వేడుక‌ల‌ కోసం ముగ్గురు స్నేహితుల‌తో క‌లిసి కారులో ప్ర‌యాణిస్తున్న స‌మ‌యంలో ప్ర‌మాదం
Telugu Student Died in America

ఉన్న‌త చ‌దువుల కోసం అమెరికా వెళ్లిన తెలుగు విద్యార్థి రోడ్డు ప్ర‌మాదంలో మృతిచెందాడు. మృతుడు ఆచంట రేవంత్‌ది ఏపీలోని బాప‌ట్ల జిల్లా ప‌ర్చూరు మండ‌లం బోడ‌వాడ‌. ఇంజ‌నీరింగ్ పూర్తి చేసిన 22 ఏళ్ల‌ రేవంత్ గ‌తేడాది డిసెంబ‌ర్‌లో ఎంఎస్ చేసేందుకు యూఎస్ వెళ్లిన‌ట్లు స‌మాచారం. ప్ర‌స్తుతం అత‌డు మాడిస‌న్ ప‌రిధిలోని డ‌కోట స్టేట్ యూనివ‌ర్సిటీలో చ‌దువుతున్న‌ట్లు బంధువులు తెలియ‌జేశారు.

మంగ‌ళవారం ఉద‌యం (భార‌త కాల‌మానం ప్ర‌కారం) బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్ కోసం ముగ్గురు స్నేహితుల‌తో క‌లిసి కారులో ప్ర‌యాణిస్తున్న స‌మ‌యంలో రోడ్డు ప్ర‌మాదం చోటుచేసుకున్న‌ట్లు స‌మాచారం. ఆక‌స్మిక‌ వాతావ‌ర‌ణం మార్పుల కార‌ణంగా ద‌ట్ట‌మైన పొగ మంచు క‌మ్ముకోవ‌డంతో కారు అదుపుత‌ప్పి బోల్తా ప‌డింది. ఈ ప్ర‌మాదంలో రేవంత్‌ తో పాటు ముగ్గురు స్నేహితుల‌కు కూడా తీవ్ర గాయాల‌య్యాయి. 

అయితే, రేవంత్ చ‌నిపోయిన‌ట్లు తెలిసింది. రేవంత్ మృతితో అత‌ని స్వ‌స్థ‌లం బోడ‌వాడ‌లో విషాదం అలముకుంది. కాగా, రేవంత్ త‌ల్లి కొన్నేళ్ల క్రితం మ‌ర‌ణించ‌గా, తండ్రి ర‌ఘుబాబు ఫిజియోథెర‌పిస్టుగా ప‌నిచేస్తున్నారు. ఉన్న‌త విద్య కోసం అమెరికా వెళ్లిన కుమారుడు ఇలా అర్థాంత‌రంగా మరణించడంతో తండ్రి గుండెల‌విసెలా రోదిస్తున్నాడు.

More Telugu News