Congress: తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన పంజాబ్ మాజీ ఎంపీ ధ‌ర‌మ్‌బీర్‌

AAP Ex MP Dharambir singh joins Congress
  • 2014లో ఆప్ త‌ర‌ఫున పాటియాలా నుంచి లోక్‌స‌భ సభ్యుడిగా ధ‌ర‌మ్‌వీర్ గెలుపు
  • 2016లో ఆప్‌కు గుడ్‌బై.. 'న‌వ‌న్ పంజాబ్' అనే పార్టీ స్థాప‌న‌
  • పాటియాలా నుంచి లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో బరిలోకి ‌దిగే యోచనలో ధ‌ర‌మ్‌వీర్ 

పంజాబ్ రాష్ట్రంలోని పాటియాల‌కు చెందిన ఆప్ మాజీ ఎంపీ ధ‌ర‌మ్‌వీర్‌ గాంధీ సోమ‌వారం కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ సీనియ‌ర్ లీడ‌ర్లు ప‌వ‌న్ ఖేరా, పంజాబ్ ఏఐసీసీ ఇన్‌చార్జి దేవేంద్ర యాద‌వ్, రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ అమ‌రీంద‌ర్ సింగ్ రాజా వారింగ్, ప్ర‌తాప్ సింగ్ బ‌జ్వాల ఆధ్వ‌ర్యంలో ఆయ‌న పార్టీలో చేరారు. 

ఇక ధ‌ర‌మ్‌వీర్‌ చేరిక‌తో కాంగ్రెస్ మ‌రింత బ‌లోపేతం అవుతుంద‌ని బ‌జ్వా పేర్కొన్నారు. అయితే, వృత్తి ప‌రంగా వైద్యుడు అయిన ధ‌ర‌మ్‌వీర్‌ సింగ్ 2013లో ఆప్ కండువా క‌ప్పుకున్నారు. మ‌రుస‌టి ఏడాది లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఆప్ త‌ర‌ఫున పాటియాలా నియోజ‌క‌వ‌ర్గం నుంచి బ‌రిలోకి దిగారు. ఈ ఎన్నిక‌ల్లో ఎంపీగా గెలిచారు. రెండేళ్ల త‌ర్వాత ఆప్‌కు గుడ్‌బై చెప్పిన ఆయ‌న‌.. 'న‌వ‌న్ పంజాబ్' అనే పార్టీని స్థాపించారు.

2019 ఎన్నిక‌ల్లో తన పార్టీ త‌ర‌ఫున పోటీ చేసిన‌ప్ప‌టికీ అంత‌గా ప్ర‌భావం చూప‌లేక‌పోయారు. తాజాగా ఆయ‌న త‌న పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. దీంతో ధ‌ర‌మ్‌వీర్‌ మరోసారి పాటియాలా నుంచి కాంగ్రెస్ త‌ర‌ఫున లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో బరిలోకి దిగ‌నున్న‌ట్టు స‌మాచారం. ఇక ఇప్ప‌టికే ఈ స్థానానికి అధికార ఆప్ త‌న అభ్య‌ర్థిని ఖ‌రారు చేయ‌డం జ‌రిగింది.

  • Loading...

More Telugu News