రేపు జిల్లాల పర్యటనకు కేసీఆర్... ఉదయం నుంచి రాత్రి వరకు షెడ్యూల్ ఇదే

BRS chief KCR to tour in Telangana tomorrow
  • ఎండిపోయిన... దెబ్బతిన్న పంటలను పరిశీలించి రైతులకు భరోసా కల్పించనున్న కేసీఆర్
  • రేపు నల్గొండ, జనగామ, సూర్యాపేట జిల్లాల్లో పర్యటించనున్న బీఆర్ఎస్ అధినేత
  • ఉదయం నుంచి సాయంత్రం వరకు బిజీబిజీ
  • రోడ్డు మార్గంలోనే ప్రయాణించనున్న కేసీఆర్
మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రేపటి నుంచి జిల్లాల్లో పర్యటించనున్నారు. సాగునీరు అందక ఎండిపోయిన పంటలను... అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను పరిశీలించి, రైతులను పరామర్శిస్తారు. బీఆర్ఎస్ అండగా ఉంటుందని వారికి భరోసా కల్పిస్తారు. తన పర్యటనలో భాగంగా రేపు ఆయన సూర్యాపేట‌, నల్గొండ, జ‌న‌గామ జిల్లాల్లోని ప‌లు మండ‌లాల్లో పర్యటిస్తారు.

కేసీఆర్ రేపటి షెడ్యూల్ ఇదీ..

కేసీఆర్ ఆదివారం ఉద‌యం 8:30 గంట‌ల‌కు ఎర్ర‌వెల్లి ఫామ్ హౌస్ నుంచి జిల్లాల ప‌ర్య‌ట‌న‌కు రోడ్డు మార్గంలో బయలుదేరుతారు. మొదట జ‌న‌గామ జిల్లాలోని ధ‌రావ‌త్ తండాకు ఉద‌యం 10:30 గంట‌ల‌కు చేరుకుంటారు. అక్క‌డ ఎండిపోయిన పంటపొలాల‌ను పరిశీలిస్తారు. మధ్యాహ్నం 11:30 గంట‌ల‌కు సూర్యాపేట జిల్లాలోని తుంగ‌తుర్తి మండ‌లం, అర్వ‌ప‌ల్లి మండ‌లం, సూర్యాపేట రూర‌ల్ మండ‌లాల్లో పర్యటిస్తారు. మ‌ధ్యాహ్నం 1 గంటలకు సూర్యాపేట రూర‌ల్ మండ‌లం నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1:30 గంట‌లకు సూర్యాపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు. మ‌ధ్యాహ్నం రెండు గంట‌ల‌కు ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో లంచ్ చేస్తారు. 

మధ్యాహ్నం 3 గంటలకు మీడియా సమావేశం నిర్వహిస్తారు. మ‌ధ్యాహ్నం 3:30 గంట‌లకు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుంచి నల్గొండ జిల్లాకు బయలుదేరుతారు. సాయంత్రం 4:30 గంట‌ల‌కు నిడ‌మ‌నూరు మండ‌లానికి చేరుకుని అక్కడ ఎండిపోయిన పంటల‌ను పరిశీలిస్తారు. సాయంత్రం ఆరు గంట‌ల‌కు నిడ‌మ‌నూరు నుంచి ఎర్ర‌వెల్లికి బయలుదేరి వెళ్తారు. రోడ్డు మార్గంలోనే ప్రయాణించి రాత్రి ఏడు గంటలకు ఎర్రవెల్లి చేరుకుంటారు.
Go Back to Shorts
KCR
BRS
Lok Sabha Polls
Jangaon District
Nalgonda District

More Telugu News