Virat Kohli: కోహ్లీ నుంచి మరో క్లాస్ ఇన్నింగ్స్... ఆర్సీబీ భారీ స్కోరు

  • బెంగళూరులో ఆర్సీబీ × కేకేఆర్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కోల్ కతా
  • 20 ఓవర్లలో 6 వికెట్లకు 182 పరుగులు చేసిన ఆర్సీబీ
  • 59 బంతుల్లో 83 పరుగులు చేసిన కోహ్లీ
Kohli guides RCB for a reasonable score

బ్యాటింగ్ కింగ్ విరాట్ కోహ్లీ తన ఫామ్ ను కొనసాగిస్తున్నాడు. కోల్ కతా నైట్ రైడర్స్ తో బెంగళూరులో జరుగుతున్న మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మొదట బ్యాటింగ్ చేసింది. విరాట్ కోహ్లీ మరోసారి తన క్లాస్ బ్యాటింగ్ ను ప్రదర్శించిన వేళ... ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 182 పరుగులు చేసింది. 

ఓపెనర్ గా బరిలో దిగిన కోహ్లీ 59 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సులతో 83 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. చివర్లో దినేశ్ కార్తీక్ ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. డీకే 8 బంతుల్లో 3 సిక్సర్లతో 20 పరుగులు చేశాడు. 

ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా రికార్డు పుటల్లోకెక్కిన మిచెల్ స్టార్క్ (రూ.24.75 కోట్లు) ఈ మ్యాచ్ లో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. 4 ఓవర్లు విసిరి 47 పరుగులు సమర్పించుకున్నాడు. ఇన్నింగ్స్ చివరి ఓవర్ ను విసిరిన స్టార్క్ ఆ ఓవర్లో రెండు సిక్సులు సహా 16 పరుగులు ఇచ్చాడు. 

అంతకుముందు, ఆర్సీబీ ఇన్నింగ్స్ చూస్తే... ఓపెనర్ గా వచ్చిన కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ 8 పరుగులకే వెనుదిరిగాడు. కామెరాన్ గ్రీన్ 33, గ్లెన్ మ్యాక్స్ వెల్ 28 పరుగులు చేశారు. మ్యాక్స్ వెల్ కు రెండు సార్లు లైఫ్ లభించినప్పటికీ సద్వినియోగం చేసుకోలేకపోయాడు. 

రజత్ పాటిదార్ (3), అనుజ్ రావత్ (3) విఫలమయ్యారు. కోల్ కతా నైట్ రైడర్స్ బౌలర్లలో హర్షిత్ రాణా 2, ఆండ్రీ రసెల్ 2, సునీల్ నరైన్ 1 వికెట్ తీశారు.

More Telugu News