Sai Charan: ఫార్మా కంపెనీ అగ్నిప్రమాదంలో ఆరుగురి ప్రాణాలు కాపాడిన బాలుడికి సీఎం రేవంత్ రెడ్డి  సన్మానం

  • గత శుక్రవారం నాడు రంగారెడ్డి జిల్లాలోని ఓ ఫార్మా కంపెనీలో అగ్నిప్రమాదం
  • ప్రమాద సమయంలో కంపెనీలో 50 మంది కార్మికులు
  • కొందరు కిటికీల్లోంచి దూకి ప్రాణాలు కాపాడుకున్న వైనం
  • ధైర్యంగా భవనంపైకి ఎక్కి తాడు కట్టిన బాలుడు సాయిచరణ్
  • తాడు పట్టుకుని బయటికి వచ్చిన మిగిలిన కార్మికులు
CM Revanth Reddy felicitates Sai Charan who saved six labour lives from fire accident

రంగారెడ్డి జిల్లా నందిగామలో గత శుక్రవారం నాడు ఓ ఫార్మా కంపెనీలో అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాదం జరిగిన సమయంలో 50 మంది కార్మికులు విధుల్లో ఉన్నారు. వారిలో చాలామంది కిటికీల్లోంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. కొందరు బయటికి రాలేక చిక్కుకుపోగా, ఓ బాలుడి సమయస్ఫూర్తి వారిని కాపాడింది. 

నందిగామకు చెందిన సాయిచరణ్ అనే బాలుడు ఎంతో సాహసోపేతంగా ఫార్మా కంపెనీ భవనంపైకి ఎక్కి తాడు కట్టడంతో, ఆ తాడును పట్టుకుని ఆరుగురు కార్మికులు సురక్షితంగా బయటికి రాగలిగారు. బాలుడు సాయిచరణ్ ను పోలీసులు, అగ్నిమాపకసిబ్బంది, ఇతరులు ఎంతగానో అభినందించారు. 

కాగా, సాయిచరణ్ సాహసానికి సంబంధించిన సమాచారం తెలంగాణకు సీఎంవోకు కూడా చేరింది. నేడు ఆ బాలుడ్ని తన కార్యాలయానికి పిలిపించిన రేవంత్ రెడ్డి ఘనంగా సన్మానించారు. బాలుడి తల్లిదండ్రులతోనూ రేవంత్ మాట్లాడారు. 

కార్మికులను కాపాడడంలో ప్రదర్శించిన తెగింపు వివరాలను రేవంత్ రెడ్డి బాలుడు సాయిచరణ్ ను అడిగి  తెలుసుకున్నారు. బాలుడి ధైర్యసాహసాల పట్ల సీఎం ముగ్ధుడయ్యారు.

More Telugu News