Revanth Reddy: కేటీఆర్ అలా మాట్లాడితే ఏమవుతుంది... చర్లపల్లి జైలులో చిప్పకూడు తింటాడు: సీఎం రేవంత్ రెడ్డి

  • ఫోన్లు కొంతమందివి విన్నాం... వింటే ఏమవుతుందని కేటీఆర్ సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం
  • అలా మాట్లాడినందుకు కేటీఆర్ ఫలితం అనుభవిస్తారని హెచ్చరిక
  • తనను దెబ్బతీసేందుకు బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటయ్యాయని ఆగ్రహం
Revanth reddy responds on Phone tapping issue

ఫోన్ ట్యాపింగ్ అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలిసారి స్పందించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ... ఫోన్‌లు విన్నాం... వింటే ఏమవుతుందని కేటీఆర్ అచ్చోసిన ఆంబోతులా మాట్లాడుతున్నారని... కానీ ఏమవుతుంది...? చర్లపల్లిలో చిప్పకూడు తింటాడని హెచ్చరించారు. కేటీఆర్ పచ్చి తాగుబోతులా మాట్లాడుతున్నారని విమర్శించారు. అలా మాట్లాడటానికి సిగ్గుండాలని వ్యాఖ్యానించారు. అందుకు ఫలితం అనుభవిస్తారన్నారు.

గద్వాల, అలంపూర్ ప్రాంతాల్లోని బోయల సమస్యలు తనకు తెలుసునన్నారు. వారి సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కానీ మీరు వారిని... వీరిని చూడవద్దని... పూర్తిగా కాంగ్రెస్ వైపు ఉండాలని కోరారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కొంతమంది అటు... కొంతమంది ఇటు ఉన్నారని... కానీ ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది కాబట్టి కాంగ్రెస్ వైపు నిలబడాలని కోరారు. 100 రోజుల్లో ఢిల్లీలో చర్చించుకునే విధంగా సుపరిపాలన అందించామన్నారు.

ఈరోజు సచివాలయానికి వెళ్లి సమస్యలు నేరుగా చెప్పుకునే పరిస్థితి రాష్ట్రంలో ఉందన్నారు. మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడం ఖాయమన్నారు. లోక్ సభ ఎన్నికల్లో మహబూబ్ నగర్‌లో కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసే కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. తనను దెబ్బతీసేందుకు బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటయ్యాయని విమర్శించారు. మహబూబ్ నగర్‌కు బీజేపీ అభ్యర్థి డీకే అరుణ ఏం చేశారు? అని నిలదీశారు. గద్వాల కాంగ్రెస్ గెలిచే సీటు అని ధీమా వ్యక్తం చేశారు. గద్వాల కోటను కాపాడింది బోయలేనని.. ఇప్పుడు వారు కాంగ్రెస్‌కు అండగా నిలబడాలన్నారు.

ఓటు చాలా విలువైనదని.. కాబట్టి అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. అందుకే తాను ఢిల్లీ నుంచి వచ్చి బిజీ షెడ్యూల్‌లో కూడా ఓటు వేశానన్నారు. మోదీ పదేళ్లుగా ప్రధానిగా ఉన్నారని... డీకే అరుణ గతంలోనూ ఎంపీగా పోటీ చేసిందని కానీ ఇక్కడ చేసిన అభివృద్ధి ఏమైనా ఉందా? అని ప్రశ్నించారు.

More Telugu News