Container: సీఎం క్యాంపు కార్యాలయంలోకి వెళ్లిన కంటైనర్ లో ఏం లోడ్ చేసి పంపారో ఇప్పుడు చెబుతున్నా: పట్టాభి

  • సీఎం క్యాంపు కార్యాలయంలోకి నిన్న ప్రవేశించిన కంటైనర్ వాహనం
  • అది సీఎం జగన్ బస్సు యాత్రలో వంట చేసే పాంట్రీ వాహనం అన్న వైసీపీ వర్గాలు
  • అందులో కరెన్సీ కట్టలతో కూడిన అట్టపెట్టెలు ఉన్నాయని టీడీపీ నేత పట్టాభి ఆరోపణ
  • ఇప్పుడది విజయవాడ ఆర్టీసీ పరిపాలన భవనం వద్ద ఉందని వెల్లడి
  • క్యాష్ క్లర్క్ చాంబర్ లో ఆ కరెన్సీ కట్టలు  లెక్కిస్తున్నారని స్పష్టీకరణ
  • ఇప్పుడక్కడికి వెళితే కౌంటింగ్ జరుగుతూ ఉంటుందని పట్టాభి చాలెంజ్
TDP leader Pattabhi press meet on container entered into CM camp office

తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలోకి ఓ కంటైనర్ ప్రవేశించడం రాజకీయ దుమారం రేపుతోంది. దీనిపై విపక్షాలు సందేహాలు వ్యక్తం చేస్తుండగా, ఆ కంటైనర్ వాహనం సీఎం జగన్ బస్సు యాత్రలో వంట చేసే పాంట్రీ వాహనం అని వైసీపీ వివరణ ఇచ్చింది. 

ఈ అంశంపై టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అది వంట పాత్రల వాహనం అంటూ కవర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. 

"తాడేపల్లి కొంపలోకి నిన్న ఓ పెద్ద కంటైనర్ వెళ్లింది. ఈ కంటైనర్ దేనికి వెళ్లింది? అక్కడ్నించి ఏం లోడ్ చేసుకుని బయటికి వచ్చింది? అంటూ దీనిపై పెద్ద చర్చ జరుగుతోంది. ఇందాక వైసీపీ బులుగు మీడియా దీన్ని కవర్ చేయడం ప్రారంభించింది. ఆ కంటైనర్ ను వంట పాత్రలు తరలించడానికి తీసుకువచ్చారంట. 

సీఎం జగన్ బస్సు యాత్రలో ఆ కంటైనర్ ను మొబైల్ కిచెన్ లా ఉపయోగిస్తారంట. కానీ ఆ కంటైనర్ ఏంటో, అందులో  ఏం తరలిస్తున్నారో నేనిప్పుడు అసలు వాస్తవం వెల్లడిస్తున్నా. నిన్ననే రేణిగుంట వద్ద పెద్ద డంప్ బయటపడింది. 53 రకాల వస్తువులతో పెద్ద డంప్ అది. రేపు ఎన్నికల్లో పంచడానికి చీరలంట, చేతివాచీలంట, కుక్కర్లంట, స్టవ్ లంట, మిక్సీలంట... ఓ గోడౌన్ లో మొత్తం పోగేసిపెట్టారు. 

ఇది బయటపడిన తర్వాత లోకేశ్ ఓ మాటన్నారు. ఇదే కాదండీ, కరెన్సీ కట్టల డంప్ లు కూడా ఉన్నాయి... వాటిపై కూడా ఓ కన్నేయండి అని ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. ఇక, నిన్న సీఎం క్యాంపు ఆఫీసులోకి వచ్చిన కంటైనర్ విషయానికొస్తే, అది కరెన్సీ కట్టలు తరలిస్తోంది. ఈ వాహనం నెంబరు ఏపీ16జెడ్ 0363 పరిశీలిస్తే ఏపీఎస్ఆర్టీసీకి చెందిన వాహనం అని స్పష్టమవుతోంది. 

ఆర్టీసీకి చెందిన వాహనంపై పోలీస్ స్టిక్కర్ అంటించారు. నోట్ల కట్టలు తరలిస్తున్నారు కాబట్టి ఎవరూ ఆపకూడదు కదా... అందుకే పోలీస్ స్టిక్కర్ వేశారు. ఈ కంటైనర్ లో అట్టపెట్టెల నిండా నోట్ల కట్టలు ఫుల్ గా నింపి, దాన్ని బయటికి పంపించారు. 

ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో విజయవాడ ఆర్టీసీ పరిపాలన భవనం ముందు అది కనిపించింది. ఆ బండిలో నుంచి కరెన్సీ కట్టలతో కూడిన అట్టపెట్టెలను దించారు. వాటిని ఎక్కడికి తీసుకెళ్లారో కూడా చెబుతాను. ఆ భవనంలో ఉన్న డిపో క్లర్క్ (క్యాష్ క్లర్క్) గదిలోకి తీసుకెళ్లి అక్కడ లెక్కబెడుతున్నారు. ఇప్పటికీ అక్కడ నోట్లు లెక్కింపు జరుగుతోంది. 

నేను చాలెంజ్ చేస్తున్నా... ఇవాళ  మీడియా ప్రతినిధులు ఎవరైనా విజయవాడ బస్ స్టేషన్ కు వెళ్లి పరిపాలన భవనం సీసీ టీవీ ఫుటేజి చూపించమనండి. ఈ కంటైనర్ వాహనం అక్కడికి వచ్చిందా? లేదా? నోట్ల కట్టలతో కూడిన అట్టపెట్టెలు దిగాయా? లేదా? అనేది బయటపడుతుంది.

కౌంటింగ్ మెషీన్ల  సాయంతో నోట్లు లెక్కిస్తున్నారు. అక్కడ్నించి రాష్ట్రమంతా ఈ కరెన్సీ కట్టలు తరలించే ప్రయత్నం జరుగుతోంది. మొన్నటి వరకు ప్రఖ్యాతిగాంచిన ఎర్రచందనం స్మగ్లర్ విజయానందరెడ్డి ఇప్పుడు ఆర్టీసీకి వైస్ చైర్మన్. చిత్తూరు అసెంబ్లీ అభ్యర్థి కూడా ఆయనే. కాబట్టి ఆయన జగన్ కు ఐడియా ఇచ్చుంటాడు. అన్నా... ఆర్టీసీ బస్సుల్లో భలే స్మగ్లింగ్ చేయొచ్చన్నా... నోట్ల కట్టలు తరలించవచ్చన్నా అని సలహా ఇచ్చి ఉంటాడు. 

చెక్ పోస్టుల వద్ద ప్రైవేటు వాహనాలు ఆపి చెక్ చేస్తారు కానీ, ఆర్టీసీ వాహనాలను ఆపి, మొత్తం పైనుంచి కింది దాకా ఎవరూ చెక్ చేయరు కదా. అసలు, నోట్ల కట్టలతో కూడిన అట్టపెట్టెలు ఆర్టీసీ పరిపాలన భవనానికి రావాల్సిన అవసరం ఏంటి? అక్కడ్నించి వాటిని ఎక్కడెక్కడికి పంపిస్తున్నారు? 

ఆర్టీసీ యాజమాన్యాన్ని మేం డిమాండ్ చేస్తున్నాం... ఏపీ16జెడ్ 0363 నెంబరు గల వాహనం మీ పరిపాలన భవనం ముందు ఆగిందా? లేదా? అందులోంచి నోట్ల కట్టలతో కూడిన అట్టపెట్టెలు దించారా? లేదా? ఆ నోట్ల కట్టలను అక్కడ క్యాష్ క్లర్క్ చాంబర్ లో లెక్కపెడుతున్నారా? లేరా?

ఏమయ్యా జగన్ రెడ్డీ... ఆర్టీసీని ఈ విధంగా వాడుకుంటున్నావా? ఈ సందర్భంగా ఎన్నికల సంఘానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. తక్షణమే ఎన్నికల సంఘం ఉన్నతాధికారులు వెళ్లి విజయవాడ బస్ స్టేషన్ ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ లో తనిఖీలు చేస్తే కోట్లాది రూపాయల డబ్బు దొరుకుతుంది. పైకేమో వంకాయలు, టమాటాలు, బంగాళాదుంపలు.. సైకో జగన్ కు వంట చేసే మొబైల్ కిచెన్ అని కవర్ చేస్తున్నారా? వైవీ సుబ్బారెడ్డి కూడా దీనిపై ఏదో చెప్పడానికి ప్రయత్నించారు. 

ఏం జగన్ రెడ్డీ... బరితెగించి మీ ఇంటి నుంచే కరెన్సీ కట్టలు లోడ్ చేసి పంపిస్తున్నావా? దీనిపై ఎన్నికల సంఘం దృష్టి పెట్టాలి. డీజీపీని కూడా ప్రశ్నిస్తున్నాం... మీలో ఏ మూల అయినా నిజాయతీ మిగిలుంటే మీ ఉన్నతాధికారులను ఆర్టీసీ పరిపాలనాభవనానికి పంపించండి. మీరు వెంటనే అక్కడికి వెళితే కరెన్సీ కట్టలు లెక్కబెడుతూ కనిపిస్తారు. 

ఆర్టీసీ యాజమాన్యం కూడా దీనిపై వివరణ ఇవ్వాలి. వారేమో ఇది వంట చేసే పాంట్రీ వాహనం అంటున్నారు... అందులో ఏమో కరెన్సీ కట్టల పెట్టెలు తీసుకువచ్చారు. చంద్రబాబు హయాంలో ఏపీఎస్ఆర్టీసీ ఎంతో పేరుప్రఖ్యాతులు సంపాదించుకుంది. అలాంటి ప్రతిష్ఠాత్మకమైన ఆర్టీసీని ఇవాళ క్యాష్ స్మగ్లింగ్ కు వాడుకుంటారా?" అంటూ పట్టాభి నిప్పులు చెరిగారు.

More Telugu News