Harish Rao: రఘునందన్ రావు పనిమంతుడు అయితే దుబ్బాకలోనే గెలిచేవాడు: హరీశ్ రావు

  • లోక్ సభ ఎన్నికల్లో మెదక్‌లో బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమన్న హరీశ్ రావు
  • కాంగ్రెస్ చేస్తున్న మోసాలు క్రమంగా ప్రజలు అర్థం చేసుకుంటున్నారని వ్యాఖ్య
  • ఆరు గ్యారెంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామన్న కాంగ్రెస్ ఆ తర్వాత మాట మార్చిందని విమర్శ
Harish rao fires at raghunandan rao

మెదక్ బీజేపీ అభ్యర్థి రఘుందన్ రావు పనిమంతుడు అయితే అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక నుంచే గెలిచేవారని బీఆర్ఎస్ సీనియర్ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ఎద్దేవా చేశారు. మంగళవారం ఆయన మెదక్ లోక్ సభ నియోజకవర్గం ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... లోక్ సభ ఎన్నికల్లో మెదక్‌లో బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమన్నారు. కాంగ్రెస్ చేస్తున్న మోసాలు క్రమంగా ప్రజలు అర్థం చేసుకుంటున్నారని పేర్కొన్నారు. ఆరు గ్యారెంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామన్న కాంగ్రెస్ ఆ తర్వాత మాట మార్చిందని విమర్శించారు. 

మాట తప్పడం కాంగ్రెస్ పార్టీకి అలవాటే అన్నారు. లోక్ సభ ఎన్నికల్లో వారికి ఓట్లు అడిగే అర్హత లేదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 38 మంది ఆటో డ్రైవర్లు, 180 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి కేబినెట్లో ముస్లింలకు మంత్రి పదవి దక్కలేదని విమర్శించారు. బీజేపీ ఇప్పటి వరకు 157 మెడికల్ కాలేజీలు ఇచ్చిందని... కానీ తెలంగాణకు ఒక్కటీ ఇవ్వలేదన్నారు. రెండు జాతీయ పార్టీలు తెలంగాణకు అన్యాయం చేశాయని మండిపడ్డారు. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ రాదని స్వయంగా రేవంత్ రెడ్డి చెబుతున్నారన్నారు. పైగా ప్రధాని మోదీని బడే భాయ్ అంటూ సంబోధిస్తున్నారని గుర్తు చేశారు.

More Telugu News