Raghunandan Rao: ఫోన్ ట్యాపింగ్ ద్వారానే నాడు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేశారు: రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు

  • 2014 నుంచే ఫోన్ ట్యాపింగ్‌లు జరిగినట్లుగా అర్థమవుతోందని వ్యాఖ్య
  • టెలిఫోన్ల ట్యాపింగ్ మీద చిత్తశుద్ధితో విచారణ జరిపించాలని విజ్ఞప్తి
  • ఈ వ్యవహారంలో కేటీఆర్, హరీశ్ రావు, అధికారులను ముద్దాయిలుగా చేర్చాలని డిమాండ్
Raghunandan Rao comments on phone tapping

ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని గతంలో ఫోన్ ట్యాపింగ్ ద్వారానే అరెస్ట్ చేశారని బీజేపీ మెదక్ లోక్ సభ అభ్యర్థి రఘునందన్ రావు అన్నారు. దీనిని బట్టి 2014 నుంచే ఫోన్ ట్యాపింగ్‌లు జరిగినట్లుగా అర్థమవుతోందన్నారు. ఆయన మంగళవారం మీడియాతో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై మాట్లాడుతూ... టెలిఫోన్ల ట్యాపింగ్ మీద చిత్తశుద్ధితో విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. ఫోన్ ట్యాపింగ్ జరిగినప్పుడు డీజీపీ, ఎస్ఐబీ చీఫ్ ఎవరున్నారో కూడా చూడాలన్నారు. ఈ వ్యవహారంలో అధికారులను కూడా క్షమించకూడదని సూచించారు.

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మొదటి ముద్దాయిగా కేటీఆర్, రెండో ముద్దాయిగా హరీశ్ రావు, మూడో ముద్దాయిగా సిద్దిపేట మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డిని చేర్చాలని డిమాండ్ చేశారు. అసలు నిందితులను ముద్దాయిలుగా చేర్చకపోతే కేసు పూర్తి కాదన్నారు. కుటుంబ సభ్యుల ఫోన్లను ట్యాపింగ్ చేసే అధికారం ఎవరికీ లేదన్నారు.

గత డీజీపీ పీఏ శ్రీనాథ్ రెడ్డి అధికారిక ఖర్చుతో అమెరికా వెళ్లారని వెల్లడించారు. ఇద్దరు అధికారులను అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదని... ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకోవాలన్నారు. ఫోన్ ట్యాపింగ్ కారణంగానే మునుగోడు ఉప ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఓడిపోయినట్లు చెప్పారు.

More Telugu News