K Kavitha: ఇది పొలిటికల్ లాండరింగ్ కేసు: రౌస్ అవెన్యూ కోర్టులో కవిత సంచలన వ్యాఖ్యలు

  • కడిగిన ముత్యంలా తాను బయటకు వస్తానన్న కవిత
  • ఇది మనీ లాండరింగ్ కేసు కాదని వ్యాఖ్య  
  • తమ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరని వెల్లడి 
I may sent to jail says Kavitha

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈ కేసులో నిందితురాలిగా ఉండటంతో ఈ కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. మరోవైపు కవిత ఈడీ కస్టడీ నిన్నటితో ముగిసింది. దీంతో, ఆమెను ఈడీ అధికారులు కాసేపటి క్రితం ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టారు. కవితను మరో 14 రోజులు కస్టడీకి ఇవ్వాలని కోర్టును ఈడీ అధికారులు కోరారు. కేసు విచారణ పురోగతిలో ఉందని... పలువురు నిందితులను ప్రశ్నిస్తున్నామని చెప్పారు. 

మరోవైపు, కోర్టు హాల్లోకి వెళ్తున్న సందర్భంగా అక్కడ ఉన్న మీడియాతో మాట్లాడుతూ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను తాత్కాలికంగా జైలుకు పంపొచ్చని... కడిగిన ముత్యంలా తాను బయటకు వస్తానని చెప్పారు. తమ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరని అన్నారు. ఈ కేసు మనీ లాండరింగ్ కేసు కాదని... పొలిటికల్ లాండరింగ్ కేసు అని విమర్శించారు. ఈ కేసులో ఒక నిందితుడు బీజేపీలో చేరారని, మరో నిందితుడు బీజేపీ టికెట్ ఆశిస్తున్నారని చెప్పారు. మూడో నిందితుడు ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా రూ. 50 కోట్లు ఇచ్చారని తెలిపారు. ఇదొక తప్పుడు కేసు అని... తాను క్లీన్ గా బయటకు వస్తానని ధీమా వ్యక్తం చేశారు.

More Telugu News