Kangana Ranaut: కాంగ్రెస్ అభ్యర్థి కంగనా రనౌత్‌పై కాంగ్రెస్‌ ప్రతినిధి సుప్రియా శ్రీనేత్ అభ్యంతరకర పోస్ట్

  • బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధానికి దారితీసిన పోస్ట్
  • కొద్దిసేపటికే పోస్ట్ డిలీట్ చేసి తన ఖాతాను ఎవరో యాక్సెస్ చేసుకున్నారన్న సుప్రియ
  • సుప్రియా పోస్టుపై కౌంటర్ ఇచ్చిన మండీ లోక్‌సభ బీజేపీ అభ్యర్థి కంగన
  • 20 ఏళ్ల సినీ కెరియర్‌లో విభిన్న మహిళల పాత్రల్లో నటించానని వెల్లడి
  • ప్రతి మహిళా గౌరవానికి అర్హురాలేనని వ్యాఖ్య
Congress party Supriya Shrinate made objectionable post on Kangana Ranaut draws BJP party ire

లోక్‌సభ ఎన్నికలు-2024లో హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఖరారైన బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌పై కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనేత్ సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్ట్ పెట్టారు. ఇన్‌స్టాగ్రామ్‌లో కంగన బోల్డ్‌గా ఉన్న ఫొటోని షేర్ చేసి అవమానకరమైన వ్యాఖ్యలు చేశారు. అయితే కొద్దిసేపటి తర్వాత సుప్రియ ఈ పోస్టును తొలగించి తన ఇన్‌స్టా అకౌంట్‌ను ఎవరో యాక్సెస్ చేసుకుని ఈ పోస్ట్ పెట్టారని ప్రకటించారు. తన ఖాతాను ఎవరో దుర్వినియోగం చేస్తున్నారని అన్నారు. అయినప్పటికీ సుప్రియ పోస్టు తీవ్ర దుమారాన్ని రేపుతోంది. కాంగ్రెస్, బీజేపీల మధ్య సోషల్ మీడియా యుద్ధానికి దారి తీసింది.

ఈ అభ్యంతరకర పోస్టుపై కంగనా రనౌత్ కూడా స్పందించారు. ‘‘సుప్రియ గారూ.. నటిగా గత 20 ఏళ్ల కెరియర్‌లో నేను అన్ని రకాల మహిళల పాత్రల్లో నటించాను. క్వీన్‌ సినిమాలో అమాయక అమ్మాయి నుంచి ధాకడ్‌ మూవీలో గూఢచారి వరకు.. మణికర్ణికలో దేవత నుంచి చంద్రముఖిలో రాక్షసురాలి వరకు విభిన్న పాత్రల్లో నటించాను. ఇక రజ్జో సినిమాలో వేశ్య నుంచి తలైవిలో విప్లవ నాయకురాలి వరకు భిన్న పాత్రలు పోషించాను. మన ఆడబిడ్డలకు పక్షపాత సంకెళ్ల నుంచి విముక్తి కల్పించాలి. మహిళల శరీర భాగాలపై ప్రదర్శించే ఉత్సుకతను మించి మనం ఎదగాలి. అన్నింటికి మించి కడుపు నింపుకోవడం సెక్స్ వర్కర్లుగా పనిచేస్తున్న వారి జీవితాలను లేదా పరిస్థితులతో ముడిపెడుతూ దూషణలకు దిగడం మానుకోవాలి. ప్రతి మహిళా గౌరవానికి అర్హురాలే’’ అని కంగన రాసుకొచ్చారు. 

జాతీయ మహిళా కమిషన్ స్పందన
సుప్రియా అభ్యంతరకర పోస్టుపై జాతీయ మహిళా కమిషన్‌ కూడా స్పందించింది. సుప్రియపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ రేఖా శర్మ ఈ లేఖ రాశారు. సుప్రియ పోస్టు చూసి దిగ్భ్రాంతికి గురైనట్టు ఆమె పేర్కొన్నారు. మహిళల పట్ల ఇలాంటి ప్రవర్తన క్షమించరానిదని ఆమె వ్యాఖ్యానించారు. సుప్రియపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.

కాగా ఆదివారం రాత్రి బీజేపీ విడుదల చేసిన జాబితాలో కంగనా రనౌత్ పేరుని ప్రకటించిన విషయం తెలిసిందే. ఆమె సొంత రాష్ట్రం హిమాచల్‌ప్రదేశ్‌లో మండి లోక్‌సభ స్థానం నుంచి ఆమె పేరుని కాషాయ పార్టీ ప్రకటించిన విషయం తెలిసిందే.

More Telugu News