KTR: పలు యూట్యూబ్ చానళ్లకు కేటీఆర్ ఘాటు వార్నింగ్

  • యూట్యూబ్ చానళ్లపై కేటీఆర్ గరం గరం
  • ఆధారాలు లేకుండా తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్నారని ఆగ్రహం
  • పరువు నష్టం కేసులు వేస్తామని, క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరిక
  • యూట్యూబ్ చానళ్లు తమ తీరు మార్చుకోవాలని హితవు
KTR warns some Youtube channels

బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొన్ని యూట్యూబ్ చానళ్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన కొన్ని యూట్యూబ్ చానళ్లు ఎలాంటి ఆధారాలు లేకుండా అడ్డగోలుగా అసత్యాలను పదేపదే ప్రసారం చేస్తున్నాయని మండిపడ్డారు. 

ప్రజలను తప్పుదోవ పట్టించేలా థంబ్ నెయిల్స్ పెడుతూ, వార్తల పేరుతో శుద్ధ అబద్ధాలను చూపిస్తున్నాయని ఘాటుగా విమర్శించారు. గుడ్డిగా వ్యతిరేకించడం వలనో, లేక, అధికార పార్టీ ఇచ్చే డబ్బులకు ఆశపడో ఇలాంటి నేరపూరితమైన, చట్టవిరుద్ధమైన వీడియోలను, ఫేక్ న్యూస్ లను ప్రచారం చేస్తున్నాయని కేటీఆర్ ఆరోపించారు. ఇది వ్యక్తిగతంగా నాతో పాటు, మా పార్టీని దెబ్బతీయాలన్న కుట్రలో భాగంగానే జరుగుతోందని భావిస్తున్నాం అని తెలిపారు. 

కేవలం ప్రజలను అయోమయానికి గురిచేసి, తప్పుదోవ పట్టించేందుకు చేస్తున్న చర్యగానే భావిస్తున్నాం అని కేటీఆర్ స్పష్టం చేశారు. గతంలోనూ ఇలాగే అసత్యప్రచారాలు, అవాస్తవాలను ప్రచారం చేసిన, ప్రచురించిన మీడియా సంస్థలపై కూడా న్యాయ పరమైన చర్యలు ప్రారంభించామని వెల్లడించారు. 

ప్రస్తుతం కొన్ని యూట్యూబ్ చానళ్లు చేస్తున్న ఈ దుర్మార్గమైన, కుట్రపూరిత చర్యలను చట్టబద్ధంగా ఎదుర్కొంటామని తెలిపారు. అసత్యాలను అదేపనిగా ప్రచారం చేసి, అడ్డమైన థంబ్ నెయిల్స్ తో వార్తల పేరిట దుష్ప్రచారం చేస్తున్న యూట్యూబ్ చానళ్లపై పరువు నష్టం కేసులతో పాటు క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటామని కేటీఆర్ హెచ్చరించారు. దీంతో పాటు, ఆయా యూట్యూబ్ చానళ్లను నిషేధించాలని యూట్యూబ్ కు అధికారికంగా ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు. 

ఇప్పటికైనా తమ తీరు మార్చుకోవాలని విజ్ఞప్తి చేస్తూనే, కుట్రపూరితంగా వ్యవహారం నడిపే యూట్యూబ్ చానళ్లు చట్టప్రకారం తగిన శిక్షకు సిద్ధంగా ఉండాలని హెచ్చరిస్తున్నామని కేటీఆర్ స్పష్టం చేశారు.

More Telugu News