Uttar Pradesh: షూటర్లకు సుపారీ ఇచ్చి మరీ తండ్రిని చంపించిన టీనేజర్!

  • ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్‌లో గురువారం ఘటన 
  • తండ్రి ఖర్చులకు సరిపడా డబ్బులు ఇవ్వట్లేదని టీనేజర్ ఘాతుకం
  • నిందితులందరినీ తాజాగా అదుపులోకి తీసుకున్న పోలీసులు
UP teenager hires goons to kill father all accused taken into custody

తనకు కావాల్సినంత డబ్బులు ఇవ్వట్లేదని తండ్రిని పొట్టనపెట్టుకున్నాడో టీనేజర్. ముగ్గురు షూటర్లకు సుపారీ ఇచ్చి చంపించాడు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్ జిల్లాలో ఈ దారుణం వెలుగు చూసింది. నిందితులందరినీ పోలీసులు ఇటీవలే అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ముహమ్మద్ నదీమ్ (50) అనే వ్యాపారిని గురువారం పత్తీ ప్రాంతంలో కొందరు నిందితులు బైక్‌పై వచ్చి కాల్చి చంపారు. ఈ దాడికి పాల్పడిన పీయూష్ పాల్, శుభమ్ సోనీ, ప్రియాంశూలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, తమకు నయీమ్‌ను చంపమని ఆయన కొడుకే సుపారీ ఇచ్చినట్టు నిందితులు విచారణలో వెల్లడించారు. ‘‘తండ్రిని చంపాలంటూ ఆ టీనేజర్‌ మాకు సుపారీ ఇచ్చాడు. ఒక్కొక్కరికీ రూ.6 లక్షలు ఇస్తామన్నాడు. అడ్వాన్స్‌గా రూ.1.5 లక్షలు ఇచ్చాడు. పనిపూర్తయ్యాక మిగతాది ఇస్తామన్నాడు’’ అని వాళ్లు తెలిపారు. 

కాగా, తన అవసరాలకు తగినంతగా డబ్బులు ఇవ్వని తండ్రిపై టీనేజర్ కోపం పెంచుకున్నాడని పోలీసులు తెలిపారు. ‘‘డబ్బులు చాలక అతడు తరచూ తండ్రి షాపులోని నగదు లేదా ఇంట్లోని నగలను చోరీ చేసేవాడు. గతంలోనూ తండ్రిని చంపించాలనుకుని ప్రయత్నించి విఫలమయ్యాడు’’ అని పోలీసులు తెలిపారు. షూటర్లను జైలుకు తరలించిన పోలీసులు టీనేజర్‌ను మాత్రం జువెనైల్ సెంటర్‌లో చేర్చారు.

More Telugu News