ఇది ముమ్మూటికీ జ‌గ‌న్ స‌ర్కారు చేసిన హ‌త్యే: నారా లోకేశ్

ఉమ్మడి కడప జిల్లాలో ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడడం పట్ల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విచారం వ్యక్తం చేశారు. రాజంపేట నియోజకవర్గం ఒంటిమిట్ట మండలం కొత్త మాధవరం గ్రామానికి చెందిన పాల సుబ్బారావు, భార్య పద్మావతి, చిన్న కుమార్తె వినయ ఆత్మహత్యకు పాల్పడడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని పేర్కొన్నారు. 

తమ భూమిని వైసీపీ నేతలు కబ్జా చేయడంతో ఆ చేనేత కుటుంబం బలవన్మరణానికి పాల్పడిందని లోకేశ్ ఆరోపించారు. ఇది ముమ్మాటికీ జగన్ సర్కారు చేసిన హత్యేనని మండిపడ్డారు. ఆ కుటుంబానికి నివాళులు అర్పిస్తున్నానని తెలిపారు. 

నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బీసీలపై జగన్ అండతో దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్న వైసీపీ మూకలను చట్టం ముందు నిలబెట్టి శిక్షిస్తామని నారా లోకేశ్ హెచ్చరించారు.


More Telugu News