G. Kishan Reddy: కూతురును అరెస్ట్ చేసినప్పుడు మాట్లాడని కేసీఆర్... కేజ్రీవాల్ అరెస్ట్‌ను ఖండిస్తున్నారు.. మర్మమేమిటో?: కిషన్ రెడ్డి ప్రశ్న

  • కవిత అరెస్ట్‌కు... తెలంగాణకు, తెలంగాణ సెంటిమెంట్‌కు, తెలంగాణ ప్రజలకు, బీజేపీకి సంబంధం లేదన్న కిషన్ రెడ్డి
  • కవితను దృష్టిలో పెట్టుకొని మద్యం కేసు దర్యాఫ్తు జరగలేదని వెల్లడి
  • మద్యం కేసులో తాను ఆధారాలు సహా నిరూపిస్తానని కేసీఆర్‌కు సవాల్
  • కేజ్రీవాల్ అరెస్ట్‌ను అందరూ సమర్థిస్తున్నారని వ్యాఖ్య
  • కేసీఆర్ ఆచరిస్తే... కేజ్రీవాల్ అనుసరించారని ఎద్దేవా
Kishan Reddy question to KCR over his black day comments

తన కూతురు కవితను అరెస్ట్ చేసినప్పుడు కేసీఆర్ మాట్లాడలేదని... కానీ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసినప్పుడు బ్లాక్ డే అంటున్నారని... దీని వెనుక మర్మం ఏమిటో చెప్పాలని తాను మాజీ ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తున్నానని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రశ్నించారు. దీని వెనుక మతలబు ఏమిటో తెలంగాణ ప్రజలకు కేసీఆర్ చెప్పాలన్నారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... కవిత అరెస్ట్‌కు... తెలంగాణ రాజకీయాలకు, బీజేపీకి, తెలంగాణకు, తెలంగాణ సెంటిమెంట్‌కు ఏమాత్రం సంబంధం లేదని పేర్కొన్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వంతో కలిసి చేసిన అవినీతికి సంబంధించి కవితను అరెస్ట్ చేశారన్నారు.

ఢిల్లీ మద్యం కేసులో కవిత పాత్ర ఉంది కాబట్టే ఈడీ అరెస్ట్ చేసిందన్నారు. కవితను దృష్టిలో పెట్టుకొని మద్యం కేసు దర్యాఫ్తు జరగలేదని వివరణ ఇచ్చారు. ఆమ్ ఆద్మీ ప్రభుత్వంలోని అధికారులు ఇచ్చిన ఫిర్యాదుతో ఈ దర్యాఫ్తు జరిగిందని వెల్లడించారు. కేజ్రీవాల్ అరెస్ట్ చేసిన రోజును చీకటి రోజు అని కేసీఆర్ చెబుతుంటే గురివింద గింజ సామెత గుర్తుకు వస్తుందని ఎద్దేవా చేశారు. మద్యం వ్యాపారం ద్వారా వేల కోట్ల రూపాయలు సంపాదించాలని ప్రయత్నించారన్నారు.

కేసీఆర్‌కు సవాల్
ముఖ్యమంత్రులు లిక్కర్ స్కాంకు పాల్పడితే బ్లాక్ డే అవుతుందా? అని ప్రశ్నించారు. ఢిల్లీలో జరిగిన మద్యం కుంభకోణానికి... మా కుటుంబానికి సంబంధం లేదని... కేజ్రీవాల్‌కు, ఆ ప్రభుత్వానికి కూడా ఈ కుంభకోణంతో సంబంధం లేదని మాజీ సీఎం కేసీఆర్ చెప్పగలరా? అని ప్రశ్నించారు. తాను కేసీఆర్‌కు సవాల్ చేస్తున్నానని... మద్యం వ్యవహారంలో ఆమ్ ఆద్మీ పార్టీ అవినీతికి పాల్పడింది... వందల కోట్లు చేతులు మారాయి... దీనిని నేను ఆధారాలతో నిరూపిస్తాను... కేసీఆర్ కాదని నిరూపించగలరా? అని వ్యాఖ్యానించారు. అమరవీరుల స్థూపం వద్దకు వస్తావా? ప్రెస్ క్లబ్ వద్దకు వస్తావా? అన్నది చెప్పాలని సవాల్ చేశారు. అయినా మద్యం అంశంపై అమరవీరుల స్థూపం వద్ద చర్చించడం తమకు ఇష్టం లేదన్నారు. మరి కేసీఆర్ వచ్చి కేజ్రీవాల్ తప్పు లేదు... ఆమ్ ఆద్మీ పార్టీ పొరపాటు లేదని చెప్పగలరా? అని నిలదీశారు.

కేజ్రీవాల్ అరెస్ట్‌ను అందరూ సమర్థిస్తున్నారు

బీరు, బ్రాందీ వ్యాపారం చేస్తే... ఆ వ్యాపారంలో అక్రమాలకు పాల్పడితే... ప్రజాధనం దోపిడీ చేస్తే... అందుకు అరెస్ట్ చేస్తే... అక్రమం ఎలా అవుతుందో చెప్పాలన్నారు. తెలంగాణలో దోచుకున్నట్లు ఢిల్లీలో దోచుకోవాలని భావించారని ఆరోపించారు. బీఆర్ఎస్, ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు సానుభూతికోసం ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. కానీ సామాన్య ప్రజలు, విజ్ఞులు, మేధావులు అర్థం చేసుకున్నారని పేర్కొన్నారు. కేజ్రీవాల్ అరెస్టును అందరూ సమర్థిస్తున్నట్లు చెప్పారు.

కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ ఆచరిస్తుంది.. దేశం అనుసరిస్తుందని పలికారని... మద్యం అక్రమాలు చూస్తే అది నిజమే అనిపిస్తోందన్నారు. ఇక్కడ కేసీఆర్ ఆచరిస్తే కేజ్రీవాల్ అనుసరించారని ఎద్దేవా చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ, కవిత చేసిన కుట్రలకు బీజేపీని విమర్శించడం సరికాదన్నారు. ఢిల్లీ మద్యం కేసులో తన కుటుంబ సభ్యులకు భాగస్వామ్యం లేదని కేసీఆర్ చెప్పగలరా? అని ప్రశ్నించారు. ఈ కేసులో పలువురు నిందితులు అప్రూవర్‌గా మారినట్లు చెప్పారు. ఢిల్లీలో తీగలాగితే హైదరాబాద్‌లో డొంక కదిలిందన్నారు.

More Telugu News