RS Praveen Kumar: ఇటీవలి పరిణామాలు మిమ్మల్ని బాధపెట్టి ఉండవచ్చు.. కానీ దయచేసి నన్ను నమ్మండి: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

  • ఉన్నతమైన లక్ష్య సాధన కోసం కొన్ని త్యాగాలు తప్పవన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
  • కొన్ని శక్తులు తనపై సోషల్ మీడియా వేదికగా దాడి చేశాయని ఆవేదన
  • దయచేసి నన్ను నమ్మండి... మీరూ నాతో కలిసి రండి అని పిలుపు
RSP appeals his followers to vote for brs

నా రాజకీయ ప్రస్థానంలో ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలు మిమ్మల్ని బాధపెట్టి ఉండవచ్చు.. కానీ దయచేసి నన్ను నమ్మండి... మీ నమ్మకాన్ని వమ్ముచేయనని ఇటీవల బీఆర్ఎస్‌లో చేరిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. బీఆర్ఎస్ ఆయనను నాగర్ కర్నూల్ లోక్ సభ అభ్యర్థిగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆయన శుక్రవారం ఎక్స్ వేదికగా ఓ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా శ్రేయోభిలాషులను ఉద్దేశించి ఆయన ట్వీట్ చేశారు.

నా రాజకీయ ప్రస్థానంలో ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలు మిమ్మల్ని బాధ పెట్టి ఉండవచ్చు... నాకూ బాధగానే ఉంది... ఒక ఉన్నతమైన లక్ష్య సాధన కోసం కొన్ని త్యాగాలు తప్పవు.. అని ఆయన పేర్కొన్నారు. అయితే విషయాన్ని అర్థం చేసుకోకుండా, తన మీద సోషల్ మీడియా వేదికగా కొన్ని శక్తులు (కొంతమంది ఆప్తులు సహా) తీవ్రమైన దాడి చేశాయని, ఇంకా చేస్తూనే ఉన్నాయన్నారు. ఇలాంటి అనాగరికమైన దాడులు తనకు కొత్త కాదని... తనను, పేద ప్రజల జీవితాలను సమూలంగా మార్చాలన్న తన లక్ష్యం నుండి ఈ చిల్లర దాడులు దూరం చేయలేవని పేర్కొన్నారు.

దయచేసి నన్ను నమ్మండి

'నేను ఇన్నాళ్లూ నిస్వార్థంగా పీడిత ప్రజల కోసమే పని చేశాను. చట్ట సభల్లో కూడా మీ గొంతుకగా ఉండాలనే లక్ష్యంతో ఎంతో విలువైన ఉద్యోగాన్ని సైతం వదలి రాజకీయాల్లోకి వచ్చాను. అసెంబ్లీలో బహుజనుల గొంతుకగా ఉండాలని రాత్రింబవళ్లు శ్రమించినా మొదటి ప్రయత్నంలో విఫలమయ్యాను. తెలంగాణ వాదం-బహుజన వాదం రెండూ ఒకటేనని నమ్మి ఎంతో శ్రమించి కేసీఆర్, బెహన్జీ మాయావతి గార్లను ఒప్పించి తెలంగాణలో చారిత్రాత్మక పొత్తు ఏర్పాటయ్యేలా చూశాను. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అది చివరి నిమిషంలో  రద్దయినప్పటికీ, ఇచ్చిన మాట మేరకు విశాల తెలంగాణ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని, దేశంలో కోట్లాది బహుజనుల బంగారు భవిష్యత్తు కోసం, భారత రాజ్యాంగ విలువల రక్షణ కోసం, కేసీఆర్‌తోనే కలసి ప్రయాణించాలనుకున్నాను. బీజేపీ కుట్రల నుండి దేశాన్ని రక్షించే దమ్ము, ధైర్యం కాంగ్రేస్‌కు ముమ్మాటికీ లేదు. అందుకే నేను ఇటీవలే భారాసలో చేరాన'ని పేర్కొన్నారు.

ఈ యుద్దంలో కేసీఆర్ మార్గదర్శనంలో సర్వశక్తులొడ్డి విజయం కోసం పోరాడతానని... దయచేసి మీరూ తనతో రావాలని పిలుపునిచ్చారు. మీకు చేతనైన సాయం చేయండి... మీ విలువైన సమయమివ్వండి... నాగర్ కర్నూల్ నియోజకవర్గానికి వచ్చి కారు గుర్తుకు ఓటెయ్యమని ఇంటింటికి ప్రచారం చేయండి... లేదా మీకు తెలిసిన వారికందరికీ కనీసం ఫోన్ చేసి అయినా చెప్పండని విజ్ఞప్తి చేశారు. నేను చట్టసభల్లో కూర్చుంటే మీరందరూ అక్కడ కూర్చున్నట్లేనని... నేను నేను కాదు... మీరే... మనమందరమూ కూడా అని పేర్కొన్నారు. అలాగే తనకు నాగర్ కర్నూలు లోక్ సభ సీటును కేటాయించిన కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు.

More Telugu News