New Delhi: మీరు జైలుకు వెళ్లవలసి ఉంటుంది... ఢిల్లీ మంత్రికి హైకోర్టు హెచ్చరిక

  • ఢిల్లీలో విస్తరిస్తున్న అక్రమ పాథలాజికల్ ల్యాబ్‌ల విషయంలో హెచ్చరిక
  • ఆరోగ్య శాఖ మంత్రి సౌరబ్ భరదర్వాజ్, కార్యదర్శి ఎస్బీ దీపక్ కుమార్‌లపై హైకోర్టు ఆగ్రహం
  • క్లినికల్ సంస్థల నియంత్రణకు చట్టం తీసుకురావడంపై ఆదేశాలు పాటించనందుకు ఆగ్రహం

ఢిల్లీలో విస్తరిస్తున్న అక్రమ పాథలాజికల్ ల్యాబ్‌ల విషయంలో ఆరోగ్య శాఖ మంత్రి సౌరబ్ భరదర్వాజ్, కార్యదర్శి ఎస్బీ దీపక్ కుమార్‌లపై ఢిల్లీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాదు, వారిని జైలుకు పంపించే అవకాశముందని హెచ్చరించింది. క్లినికల్ సంస్థలను నియంత్రించేందుకు చట్టం తీసుకురావడంపై న్యాయపరమైన ఆదేశాలు పాటించనందుకు చేపట్టిన విచారణ సందర్భంగా వారిపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 

మీరు ప్రజాసేవకులు... అక్రమ ల్యాబ్‌ల వల్ల ప్రజలు తమ రక్త నమూనాల గురించి తప్పుడు నివేదికలు పొందుతున్నారని, దీనివల్ల ఏదైనా జరిగితే మీరిద్దరూ జైలుకు వెళ్లక తప్పదని హెచ్చరించింది. ఇందులో ఎలాంటి సందేహం లేదని పేర్కొంది. అనధికార ల్యాబ్‌ల నియంత్రణకై వెంటనే న్యాయపరమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని, ఇందుకు తన చాంబర్‌లో మంత్రి, కార్యదర్శితో సమావేశం కావాలని స్టాండింగ్ కౌన్సిల్‌ను ఆదేశించింది. రిజిస్ట్రేషన్ అండ్ రెగ్యులేషన్ బిల్లు 2022పై చర్చ జరుగుతున్నప్పుడు వారు నిబంధనలకు అనుకూలంగా వ్యవహరించలేదని కోర్టు పేర్కొంది.

2022 నుంచి అక్రమ ల్యాబ్‌ల విషయంలో నియంత్రణకు ఏర్పాటు చేసిన చట్టాన్ని అమలు చేయలేదని, ఈ జాప్యానికి కారణాలు ఏమిటో తెలిపేందుకు విచారణకు హాజరు కావాలని కోర్టు వీరిద్దరినీ కోరింది. దీంతో వారు కోర్టు ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈ సమయంలో వారిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

More Telugu News