అరెస్ట్ తర్వాత కేజ్రీవాల్ తొలి స్పందన ఇదే!

  • జైల్లో ఉన్నా, బయట ఉన్నా తన జీవితం దేశానికి అంకితమన్న కేజ్రీవాల్
  • కటకటాల వెనక నుంచి కూడా దేశం కోసం పని చేస్తానని వ్యాఖ్య
  • నిన్న రాత్రి 9 గంటల సమయంలో కేజ్రీని అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టైన ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రస్తుతం రౌస్ అవెన్యూ కోర్టులో ఉన్నారు. కేజ్రీవాల్ ను ఈ మధ్యాహ్నం కోర్టులో ఈడీ అధికారులు హాజరుపరిచారు. అరెస్ట్ అయిన తర్వాత కేజ్రీవాల్ తొలిసారి స్పందించారు. కోర్టు హాల్లోకి తీసుకెళ్తున్న సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ... లోపల (జైల్లో) ఉన్నా, బయట ఉన్నా తన జీవితం ఈ దేశానికి అంకితమని అన్నారు. కటకటాల వెనుక నుంచి కూడా తాను మన దేశం కోసం పని చేస్తూనే ఉంటానని చెప్పారు.         

కేజ్రీవాల్ ను నిన్న రాత్రి 9 గంటల సమయంలో ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆయన నివాసంలోని మరో గేటు నుంచి భారీ భద్రత మధ్య ఈడీ ప్రధాన కార్యాలయానికి తరలించారు. ఆయన ఎవరితోనూ మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా తీసుకెళ్లారు. రాత్రంతా ఆయన ఈడీ కార్యాలయంలోనే ఉన్నారు. మధ్యాహ్నం వైద్య పరీక్షల అనంతరం ఆయనను కోర్టులో హాజరుపరిచారు. కోర్టులోకి వెళ్తున్న సమయంలో మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన రెండు ముక్కల్లో సమాధానం ఇచ్చారు. ఈలోగానే ఆయనను కోర్టులోకి తీసుకెళ్లారు. 



More Telugu News

Arvind Kejriwal AAP Delhi Liquor Scam Enforcement Directorate