Nara Lokesh: అందుబాటులో ఉండి సేవచేస్తా.. ఆశీర్వదించండి: నారా లోకేశ్

  • మంగళగిరిలో తటస్థ ప్రముఖులతో లోకేశ్ భేటీలు
  • అభివృద్ధి పేరు చెపితే మంగళగిరి గుర్తొచ్చేలా చేస్తానన్న లోకేశ్
  • బీసీలు, ముస్లింల అభివృద్ధికి టీడీపీ కట్టుబడి ఉందని వ్యాఖ్య
Nara Lokesh in Mangalagiri

మంగళగిరి ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో తనను గెలిపిస్తే... అభివృద్ధి పేరు చెపితే మంగళగిరి గుర్తొచ్చేలా చేస్తానని టీడీపీ యువనేత నారా లోకేశ్ అన్నారు. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందిస్తానని చెప్పారు. కుటుంబ సభ్యుడిలా తనను ఆశీర్వదించాలని కోరారు. రాబోయే ఎన్నికల్లో తాను విజయం సాధించాక మంగళగిరిని ఆదర్శంగా తీర్చిదిద్దడానికి అవసరమైన ప్రణాళికలు తమవద్ద ఉన్నాయని లోకేశ్ చెప్పారు. మంగళగిరి నియోజకవర్గంలో పలువురు తటస్థ ప్రముఖులను వారి ఇళ్లకు వెళ్లి మర్యాదపూర్వకంగా లోకేశ్ కలుసుకున్నారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 

తొలుత మంగళగిరి 29వ వార్డుకు చెందిన ముస్లిం ప్రముఖుడు షేక్ మౌలాలి ఇంటికి లోకేశ్ వెళ్లారు. వారి కుటుంబసభ్యులు లోకేష్ కు పుష్పగుచ్చాలను అందించి ఆప్యాయంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ... ముస్లిం సోదరుల అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందని, గత ప్రభుత్వంలో రంజాన్ తోఫా, దుల్హాన్, విదేశీ విద్యతో పాటు షాదీఖానాల నిర్మాణం చేపట్టామని చెప్పారు. వైసీపీ వేధింపులతో పలమనేరులో పదో తరగతి విద్యార్థిని మిస్బాను ఆత్మహత్య చేరుకునేలా ఒత్తిడి చేశారని, నంద్యాలలో అబ్ధుల్ సలామ్ పై దొంగ అనే ముద్ర వేయడంతో కుటుంబసభ్యులతో కలిసి ఆయన ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయేది ప్రజా ప్రభుత్వమని, ముస్లింలకు రక్షణ కల్పించడమే గాక వారి సంక్షేమానికి గతంలో చేపట్టిన పథకాలన్నీ పునరుద్ధరిస్తామని అన్నారు. 

ఆ తర్వాత 31వ వార్డులోని అంజుమన్ ఎ హిమయతుల్ ఇస్లామ్ (అంజుమన్ కమిటీ) కార్యాలయాన్ని సందర్శించి, ఆ సంస్థ ప్రతినిధులతో భేటీ అయ్యారు. వక్ఫ్ బోర్డు ఆస్తులు ఆన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోవాలని, షాదీఖానాలు, ఖబరిస్థాన్ ల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని వారు లోకేశ్ ని కోరారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ... రాష్ట్రంలో వైసీపీ నేతలు వక్ఫ్ బోర్డు, మసీదులకు చెందిన వేల కోట్ల ఆస్తులను అన్యాక్రాంతం చేస్తున్నారని, నర్సరావుపేట మసీదు ఆస్తుల కబ్జాను అడ్డుకున్న ఇబ్రహీంను దారుణంగా నరికి చంపారని చెప్పారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక గతంలో ముస్లింల సంక్షేమానికి చేపట్టిన పథకాలన్నింటినీ రద్దుచేశారని మండిపడ్డారు. ముస్లింలకు చెందాల్సిన రూ.5,500 కోట్ల సబ్ ప్లాన్ నిధులను దారి మళ్లించారని విమర్శించారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వక్ఫ్ ఆస్తుల రక్షణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. 

అనంతరం మంగళగిరి 5వ వార్డుకు చెందిన వస్త్ర వ్యాపారి కోలా వీరాంజనేయులును ఆయన నివాసంలో కలిశారు. కృష్ణబలిజ సామాజికవర్గీయులు ఎదుర్కొంటున్న సమస్యలను ఈ సందర్భంగా యువనేత దృష్టికి తెచ్చారు. తెలుగుదేశం పార్టీ బీసీలకు పుట్టినిల్లు లాంటిది, అన్ని బీసీ వర్గాలకు రాబోయే ప్రభుత్వంలో న్యాయం చేస్తామని, బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం అమలు చేస్తామని లోకేశ్ తెలిపారు.

More Telugu News