Arvind Kejriwal: కేజ్రీవాల్ పిటిషన్ పై అత్యవసర విచారణ.. పిటిషన్ ను ప్రత్యేక బెంచ్ కు కేటాయించిన సీజేఐ

  • ఈడీ తనను అరెస్ట్ చేయడంపై సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ పిటిషన్
  • పిటిషన్ పై అత్యవసర విచారణకు అంగీకరించిన సుప్రీంకోర్టు
  • నిన్న రాత్రి కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసిన ఈడీ
Supreme Court agrees to hear Kejriwal petition urgently

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో తనను అరెస్ట్ చేయడాన్ని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్ పై అత్యవసర విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ ను ప్రత్యేక బెంచ్ కు సీజేఐ చంద్రచూడ్ కేటాయించారు. ఈ పిటిషన్ ను జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ బేలా త్రివేదీలతో కూడిన ప్రత్యేక ధర్మాసనం విచారించనుంది. 

నిన్న రాత్రి కేజ్రీవాల్ ను ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈడీ తనను అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ కేజ్రీవాల్ వేసిన పిటిషన్ ను నిన్న విచారించిన ఢిల్లీ హైకోర్టు... ఈడీ అరెస్ట్ నుంచి రక్షించడానికి ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టం చేసింది. ఈ తీర్పు వెలువడిన గంటల వ్యవధిలోనే కేజ్రీవాల్ నివాసానికి ఈడీ అధికారులు చేరుకున్నారు. దాదాపు రెండు గంటల విచారణ అనంతరం ఆయనను అదుపులోకి తీసుకుని ఈడీ ప్రధాన కార్యాలయానికి తరలించారు. కాసేపట్లో రౌస్ అవెన్యూ కోర్టులో కేజ్రీవాల్ ను ప్రవేశ పెట్టబోతున్నారు. కేజ్రీవాల్ ను 10 రోజుల కస్టడీకి ఈడీ కోరే అవకాశం ఉంది.

More Telugu News