Rahul Gandhi: మా నేతలను ప్రచారానికి ఎక్కడకూ పంపించలేకపోతున్నాం... రైలు టిక్కెట్‌కు కూడా డబ్బుల్లేవ్: రాహుల్ గాంధీ

  • కాంగ్రెస్ బ్యాంకు ఖాతాల ఫ్రీజ్, ఎన్నికల బాండ్ల అంశాలపై మాట్లాడిన రాహుల్ గాంధీ
  • ఎన్నికల సమయంలో డబ్బులు లేకపోవడంతో ప్రచారం చేయలేకపోతున్నామని వెల్లడి
  • ఈరోజుల్లో బ్యాంకు ఖాతాలు పని చేయకుంటే పరిస్థితి ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందేనని వ్యాఖ్య
No money to buy even train ticket says Rahul Gandhi

ఎన్నికల ప్రచార సమయంలో మా నేతలను ఎక్కడకూ పంపించలేకపోతున్నాం... విమాన ప్రయాణాలను పక్కన పెట్టాం... కనీసం రైలు టిక్కెట్లు కొనడానికి కూడా తమ వద్ద డబ్బులు లేవని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. కాంగ్రెస్ బ్యాంకు ఖాతాల ఫ్రీజ్, ఎన్నికల బాండ్ల అంశాలపై ఆయన మాట్లాడుతూ... తమ పార్టీని దెబ్బతీసేందుకు ప్రధాని మోదీ తీవ్ర చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో డబ్బులు లేకపోవడంతో ప్రచారం కూడా చేయలేకపోతున్నట్లు తెలిపారు.

తమ పార్టీపై ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పాల్పడుతున్న నేరపూరిత చర్యకు పాల్పడుతున్నారన్నారు. మా బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజుల్లో బ్యాంకు ఖాతాలు పని చేయకుంటే పరిస్థితి ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే అన్నారు. తాము ఎలాంటి ట్రాన్సాక్షన్స్ చేయలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. తమ పార్టీ ఖాతాలను ఫ్రీజ్ చేయడమంటే భారత ప్రజాస్వామ్యాన్ని అడ్డుకోవడమే అన్నారు. ఈ రోజు దేశంలో ప్రజాస్వామ్యం అనేదే లేకుండా పోయిందన్నారు.

ప్రజాస్వామ్యం అనేది ఇప్పుడు అబద్దంగా మారిందని వ్యాఖ్యానించారు. దేశంలో 20 శాతం మంది ఓటర్లు తమకు మద్దతుగా ఉన్నారని పేర్కొన్నారు. కానీ తాము రెండు రూపాయలు కూడా చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఎన్నికల్లో పోరాడకుండా తమ సామర్థ్యాన్ని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఈ అంశానికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు చేపట్టలేదని వాపోయారు.

More Telugu News