కవిత త్వరగా బయటకు రావాలంటే ఆమె భర్త ఈడీ విచారణకు సహకరించాలి!: ధర్మపురి అరవింద్

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత త్వరగా బయటకు రావాలంటే ఆమె భర్త అనిల్ ఈడీ విచారణకు సహకరించాలని... ఆయన తప్పించుకొని తిరగకూడదని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ సూచించారు. ఈడీ అధికారులు విచారణకు పిలిస్తే ఆయన వారి ఎదుట హాజరుకాకుండా తప్పించుకొని తిరుగుతున్నారని విమర్శించారు. అరవింద్ బుధవారం ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ... కవిత అరెస్ట్‌తో బీజేపీ, బీఆర్ఎస్ మధ్య ఒప్పందం ఉందనే ప్రచారం అబద్ధమేనని తేలిపోయిందన్నారు. మొదటి నుంచి తాము కూడా ఇదే చెబుతున్నామని పేర్కొన్నారు.

రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా అయిదేళ్ళు కొనసాగాలని తాము కోరుకుంటున్నామన్నారు. ఆరు గ్యారెంటీలు అమలు చేసిన తర్వాతనే ఆయన ముఖ్యమంత్రి పీఠాన్ని వీడాలన్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి కాంగ్రెస్‌తోనే పోటీ అన్నారు. రాష్ట్రంలోని 16 లోక్ సభ స్థానాల్లో బీఆర్ఎస్ డిపాజిట్ కోల్పోతుందని జోస్యం చెప్పారు. ఒక్క మెదక్ పార్లమెంట్ సీటులో మాత్రమే బీఆర్ఎస్‌కు డిపాజిట్ దక్కుతుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిజాం ఘగర్ ఫ్యాక్టరీని తెరిపించే బాధ్యతను తాను తీసుకుంటున్నానని... అవసరమైతే రైతులకు పేపర్ మీద రాసిస్తానన్నారు. లోక్ సభ ఎన్నికల్లో గెలిచిన నెలలోపు నిజాం ఘగర్ ఫ్యాక్టరీ తిరిగి తెరిపిస్తానని హామీ ఇచ్చారు.


More Telugu News