Cricket Australia: భార‌త్‌తో ఐదు టెస్టు మ్యాచుల సిరీస్‌కు వేదిక‌ల‌ను ఖ‌రారు చేసిన ఆస్ట్రేలియా

  • న‌వంబ‌ర్‌లో ఆస్ట్రేలియాలో ప‌ర్య‌టించ‌నున్న టీమిండియా 
  • పెర్త్ వేదిక‌గా మొద‌టి టెస్టు
  • అడిలైడ్ ఓవ‌ల్‌ మైదానంలో రెండో టెస్టు 
  • మూడో టెస్టుకు గ‌బ్బా స్టేడియం ఆతిథ్యం
  • ఆసీస్‌లోని అతిపెద్ద క్రికెట్ గ్రౌండ్ మెల్‌బోర్న్‌లో బాక్సింగ్ డే టెస్టు 
  • సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో ఐదో టెస్టు మ్యాచ్
  • క్రికెట్ ఆస్ట్రేలియా అధికార ప్ర‌తినిధి 'సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్'కి వెల్ల‌డి 
Cricket Australia Finalises Venues For 5 Tests vs India

భార‌త్‌తో స్వ‌దేశంలో జ‌రిగే ఐదు టెస్టు మ్యాచుల సిరీస్‌కు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) తాజాగా వేదిక‌ల‌ను ఖ‌రారు చేసింది. న‌వంబ‌ర్‌లో ప్రారంభ‌మ‌య్యే ఈ సిరీస్‌లో భాగంగా మొద‌టి టెస్టును పెర్త్ స్టేడియంలో నిర్వ‌హించాల‌ని సీఏ నిర్ణ‌యించింది. కాగా, ఇటీవ‌ల పాకిస్థాన్‌తో ఈ మైదానంలో జ‌రిగిన టెస్టు మ్యాచ్‌కు ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ క‌రవైంది. దాదాపు 60వేల మంది కూర్చునే సామ‌ర్థ్యం క‌లిగిన ఈ కొత్త పెర్త్ స్టేడియంలో పాక్‌తో మ్యాచ్ సంద‌ర్భంగా కేవ‌లం 17,666 మంది ప్రేక్ష‌కులు మాత్ర‌మే వ‌చ్చారు. 

దీంతో ఎలాగైనా ఇండియాతో మ్యాచ్‌కు ఈ మైదానానికి భారీ మొత్తంలో జ‌నాలను ర‌ప్పించాల‌ని క్రికెట్ ఆస్ట్రేలియా, వెస్ట‌ర్న్ ఆస్ట్రేలియా సంయుక్తంగా చ‌ర్య‌లు మొద‌లెట్టాయి. అయితే, బిగ్ బాస్ లీగ్‌కు మాత్రం పెర్త్‌కు ప్రేక్ష‌కులు బాగానే వ‌స్తున్నార‌ట‌. ఈ ఏడాది బీబీఎల్‌లో భాగంగా పెర్త్ స్కార్చ‌ర్స్ మ్యాచ్‌కు రికార్డు స్థాయిలో 28,494 మంది ఈ మైదానానికి వ‌చ్చిన‌ట్లు తెలిసింది. 

ఇక సిరీస్‌లో రెండో టెస్టు అడిలైడ్ ఓవ‌ల్‌ మైదానంలో జ‌ర‌గ‌నుంది. అలాగే మూడో టెస్టుకు గ‌బ్బా స్టేడియం ఆతిథ్యం ఇవ్వ‌నుంది. నాలుగో మ్యాచ్‌ (బాక్సింగ్ డే టెస్టు) ఆసీస్‌లోని అతిపెద్ద క్రికెట్ గ్రౌండ్ మెల్‌బోర్న్‌లో జ‌రుగుతుంది. ఇక ఆఖ‌రిదైన ఐదో టెస్టు మ్యాచ్ సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో జ‌ర‌గ‌నుంది. ఈ మేర‌కు టీమిండియాతో ఐదు టెస్టుల సిరీస్ కోసం షెడ్యూల్ ఖ‌రార‌యింద‌ని క్రికెట్ ఆస్ట్రేలియా అధికార ప్ర‌తినిధి ఒక‌రు 'సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్' న్యూస్ ఏజెన్సీకి వెల్ల‌డించారు.

More Telugu News