ed: కవితను అరెస్ట్ చేసే సమయంలో బంధువులు అడ్డుకున్నారు: అరెస్ట్‌పై ఈడీ కీలక ప్రకటన

  • ఈ నెల 15వ తేదీన కవితను అరెస్ట్ చేశామని ప్రకటనలో వెల్లడి
  • ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో కవితను అరెస్ట్ చేసినట్లు పేర్కొన్న ఈడీ
  • 23వ తేదీ వరకు కవిత ఈడీ కస్టడీలో ఉంటుందని స్పష్టీకరణ
  • ములాఖత్‌లో భాగంగా కవితను కలిసేందుకు ఈడీ కార్యాలయానికి చేరుకున్న కేటీఆర్, హరీశ్ రావు
ED on brs mlc kavitha arrest

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్‌పై ఈడీ సోమవారం ఓ ప్రకటనను విడుదల చేసింది. ఈ నెల 15వ తేదీన కవితను అరెస్ట్ చేశామని ఆ ప్రకటనలో పేర్కొంది. అరెస్ట్ చేసిన సమయంలో బంధువులు ఇబ్బందులు కలిగించారని తెలిపింది. ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో కవితను అరెస్ట్ చేసినట్లు వెల్లడించింది. ఢిల్లీ ప్రత్యేక కోర్టు కవితను ఏడు రోజుల కస్టడీకి అనుమతించిందని ఆ ప్రకటనలో స్పష్టం చేసింది. ఈ నెల 23వ తేదీ వరకు కవిత ఈడీ కస్టడీలో ఉంటుందని పేర్కొంది.

కోర్టు అనుమతి తీసుకొని తాము కవితను విచారిస్తున్నామని ఆ ప్రకటనలో పేర్కొంది. వంద కోట్ల ముడుపుల వ్యవహారంలో కవిత ప్రమేయం ఉందని తెలిపింది. ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు వందల కోట్ల చెల్లింపులో కవితది కీలక పాత్ర అని పేర్కొంది. ఇప్పటి వరకు 240 చోట్ల సోదాలు చేశామని, 5 సప్లిమెంటరీ ఛార్జీషీట్లు దాఖలు చేశామని తెలిపింది. సోదాల్లో రూ.128 కోట్ల ఆస్తులను గుర్తించామని తెలిపింది. మనీస్ సిసోడియా సహా పలువురితో కవితకు లింకులు ఉన్నట్లు వెల్లడైందని పేర్కొంది.

ఈడీ కార్యాలయానికి కేటీఆర్, హరీశ్ రావు

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు సోమవారం సాయంత్రం ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. ములాఖత్‌లో భాగంగా వీరిద్దరు కవితను ఈడీ కేంద్ర కార్యాలయంలో కలవనున్నారు. కవితను ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు కలిసేందుకు కోర్టు అనుమతించిన విషయం తెలిసిందే. మరోవైపు కవితతో ములాఖత్ కోసం భర్త అనిల్ రాలేదు. ఆయనను ఈడీ విచారణకు పిలిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాను విచారణకు హాజరు కాలేనని ఈడీకి లేఖ రాశారు. పది రోజుల వరకు ఈడీ కార్యాలయానికి రాలేనని లేఖలో పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ములాఖత్‌కు రాలేదు.

More Telugu News