kenya: కెన్యాలో తెగిపోయిన డ్యామ్​.. 42 మంది మృతి.. బురదలో కూరుకుపోయిన వారి కోసం గాలింపు!

  • మాయి మహియు పట్టణం సమీపంలో తెగిన డ్యామ్
  • వరద ముంచెత్తడంతో వందల ఇళ్లు కొట్టుకుపోయిన తీరు
  • పెద్ద సంఖ్యలో జనం గల్లంతు కావడంతో గాలింపు చర్యలు
42 dead as kenya dam bursts

కొన్ని రోజులుగా అతి భారీ వర్షాలతో అతలాకుతలం అవుతున్న కెన్యాలో ఓ డ్యామ్ తెగిపోయి బీభత్సం సృష్టించింది. నకురు కౌంటీలోని మాయి మహియు పట్టణ సమీపంలోని డ్యామ్ లో నీటి ఒత్తిడికి కట్ట తెగిపోయింది. నీరంతా సమీపంలోని ఊళ్లను ముంచెత్తింది. దీంతో పెద్ద సంఖ్యలో ఇళ్లు కొట్టుకుపోయాయి. రోడ్లు తెగిపోయాయి. ఇప్పటివరకు 42 మంది మృత దేహాలను గుర్తించారు.

బురదలో గాలింపు..
పెద్ద సంఖ్యలో ఇళ్లు కొట్టుకుపోవడంతో.. చాలా మంది ఆచూకీ తెలియకుండా పోయింది. దీంతో ఇళ్ల శిథిలాల్లో, ఆ చుట్టు పక్కల ప్రాంతాల్లో పేరుకుపోయిన బురదలో మృతదేహాల కోసం గాలిస్తున్నట్టు స్థానిక అధికారులు ప్రకటించారు. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. వేగంగా సహాయక చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు.

వరుసగా భారీ వర్షాలతో..
కెన్యాలో కొన్ని రోజులుగా భారీ వర్షాలతో వరదలు ముంచెత్తుతున్నాయి. దీంతో మార్చి, ఏప్రిల్ రెండు నెలల్లోనే 120 మందికిపైగా మరణించినట్టు ఆ దేశ అధికారులు తెలిపారు. 24 వేలకుపైగా ఇళ్లు నీట మునిగాయని.. లక్షలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని వెల్లడించారు. భారీ వర్షాలు, వరదలతో కెన్యా వ్యాప్తంగా విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు.

కెన్యా పక్కనే ఉన్న టాంజానియా, బురుండి, ఉగాండా దేశాల్లోనూ వరదలు ముంచెత్తుతున్నాయి. ఇప్పటికే ఆ దేశాల్లో వందలాది మంది మరణించినట్టు ఐక్యరాజ్య సమితి ఇటీవల వెల్లడించింది కూడా.

More Telugu News