RCB Women: డబ్ల్యూపీఎల్ విజేత ఆర్సీబీ... పురుషుల టీమ్ కు సాధ్యం కానిది అమ్మాయిలు సాధించారు!

  • డబ్ల్యూపీఎల్ ఫైనల్లో 8 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ ను ఓడించిన ఆర్సీబీ
  • 114 పరుగుల లక్ష్యాన్ని 19.3 ఓవర్లలో ఛేదించిన వైనం
  • రాణించిన టాపార్డర్
  • ప్రైజ్ మనీగా రూ.6 కోట్లు అందుకోనున్న బెంగళూరు టీమ్
RCB emerged as WPL winner of 2024 season

ఐపీఎల్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కథ వేరే. అన్నీ ఉన్నా అదృష్టం లేక ఇప్పటివరకు ఒక్కసారి కూడా టైటిల్ నెగ్గలేకపోయింది. ఇప్పుడా లోటును అమ్మాయిలు తీర్చారు. ఈ ఏడాది ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టైటిల్ ను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అమ్మాయిల జట్టు కైవసం చేసుకుంది. 

ఇవాళ జరిగిన డబ్ల్యూపీఎల్ ఫైనల్లో ఆర్సీబీ జట్టు 8 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుపై ఘనవిజయం సాధించింది. 114 పరుగుల విజయలక్ష్యాన్ని బెంగళూరు జట్టు 19.3 ఓవర్లలో కేవలం 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆర్సీబీ ఛేజింగ్ లో టాపార్డర్ రాణించింది. ఓపెనర్లు కెప్టెన్ స్మృతి మంధన 31, సోఫీ డివైన్ 32, ఎలిస్ పెర్రీ 35 (నాటౌట్), రిచా ఘోష్ 17 (నాటౌట్) పరుగులు చేశారు. ఢిల్లీ బౌలర్లలో శిఖా పాండే 1, మిను మణి 1 వికెట్ తీశారు. 

ఈ విజయంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ ఆనందోత్సాహాల్లో మునిగి తేలుతోంది. డబ్ల్యూపీఎల్ ట్రోఫీతో పాటు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అమ్మాయిల జట్టుకు రూ.6 కోట్ల ప్రైజ్ మనీ లభించనుంది. రన్నరప్ గా నిలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ కు రూ.3 కోట్ల ప్రైజ్ మనీ దక్కనుంది.

More Telugu News