Sidhu Moosewala: 58 ఏళ్ల వయసులో బిడ్డకు జన్మనిచ్చిన సిద్ధూ మూసేవాలా తల్లి

  • ఐవీఎఫ్ విధానంతో గర్భం.. తల్లీబిడ్డా ఆరోగ్యంగా ఉన్నారన్న వైద్యులు
  • కొడుకు పుట్టాడని సోషల్ మీడియాలో సిద్ధూ తండ్రి వెల్లడి
  • రెండేళ్ల కిందట హత్యకు గురైన పంజాబీ సింగర్ సిద్ధూ
Sidhu Moosewala mother welcomes baby boy at the age of 58

పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలా గుర్తున్నాడా.. 2002లో కారులో వెళుతున్న సిద్దూపై దుండగులు కాల్పులు జరపడంతో అక్కడికక్కడే చనిపోయాడు. పంజాబ్ తో పాటు దేశవిదేశాల్లో అభిమానులను సంపాదించుకున్న 28 ఏళ్ల సింగర్ హత్య అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆయన అభిమానులు నిరసన ప్రదర్శనలు చేశారు. హంతకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సిద్ధూ మూసేవాలా అలియాస్ శుభ్ దీప్ సింగ్ పేరెంట్స్ మరోసారి తల్లిదండ్రులయ్యారు. ఉన్న ఒక్క కొడుకు దారుణ హత్యకు గురవడంతో సిద్ధూ తల్లి 58 ఏళ్ల చరణ్ కౌర్ ఐవీఎఫ్ ద్వారా గర్భం దాల్చి తాజాగా పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.

ఒడిలో పసికందుతో సిద్దూ తండ్రి బాల్కౌర్ సింగ్ సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దేవుడి దయ, సిద్ధూ అభిమానుల ఆశీస్సులు, శ్రేయోభిలాషుల దీవెనలతో తమకు కొడుకు పుట్టాడని బాల్కౌర్ సింగ్ తన ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారని వెల్లడించారు. సిద్ధూ మూసేవాలా ఫొటో పక్కన ఒడిలో బాబుతో ఉన్న ఈ ఫొటో ప్రస్తుతం వైరల్ గా మారింది. సిద్ధూ అభిమానులు సంతోషంగా కామెంట్లు పెడుతున్నారు. సిద్ధూ భాయ్ మళ్లీ వచ్చాడంటూ సంబరపడుతున్నారు.

More Telugu News